T20 World Cup 2026 : ఇండియాను కొట్టకుండా కప్పు కొట్టలేరు బాసూ !
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్లో భారత్ను ఓడించకుండా ఎవరూ ట్రోఫీ గెలవలేరని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ పేర్కొన్నారు. మరోవైపు భారత ఓపెనింగ్ జోడీపై సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్ ఇచ్చారు.

ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలిచేది ఎవరు?
రెండుసార్లు టీ20 ప్రపంచకప్ను అందించిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల క్రితం తాను కెప్టెన్గా ఏ నగరంలోనైతే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడారో, అదే నగరానికి కోచ్గా తిరిగి వచ్చిన సామీ, రాబోయే ప్రపంచకప్పై తన విశ్లేషణను పంచుకున్నారు.
ఈసారి టైటిల్ గెలవాలని ఆశించే ఏ జట్టు అయినా సరే, ముందుగా ఆతిథ్య భారత్ను ఓడించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 2016లో వెస్టిండీస్ టైటిల్ గెలిచినప్పుడు కూడా సెమీఫైనల్లో భారత్ను ఓడించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
2016 జ్ఞాపకాలు.. ప్రస్తుత సవాళ్లు ఇవే
"భారత్ను దాటకుండా ఈ ప్రపంచకప్ను ఎవరూ గెలవలేరు" అని సామీ తేల్చి చెప్పారు. 2016 సెమీఫైనల్లో ముంబై లో భారత్ను ఓడించిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను కెప్టెన్గా ఉన్నానని, ఇప్పుడు డగౌట్లో కోచ్గా ఉన్నానని, కానీ నమ్మకం మాత్రం మారలేదని అన్నారు.
అయితే, ప్రస్తుతం భారత్ ఆడుతున్న దూకుడు చూస్తుంటే సవాలు మరింత పెద్దదిగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గెలవగలమనే నమ్మకం లేకపోతే తాము ఇక్కడ ఉండమని, తమ డ్రెస్సింగ్ రూమ్లో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారని సామీ ధీమా వ్యక్తం చేశారు.
భారతే హాట్ ఫేవరెట్
వరల్డ్ కప్ గెలవాలంటే టీమ్ ఇండియాతో తలపడటం తప్పదని సామీ అన్నారు. 2016లో తాము వచ్చినప్పుడు కూడా ముందుగా భారత్తో వార్మప్ మ్యాచ్ ఆడామని, ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్లు, అప్పటి కోచ్ ఫిల్ సిమన్స్తో కలిసి కూర్చుని చర్చించుకున్నామని చెప్పారు.
"ఈ వరల్డ్ కప్ గెలవాలంటే, మీరు భారత్ను అధిగమించాలి" అని అప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాకౌట్ దశలో లేదా ఫైనల్లో భారత్ను ఓడించడం ఏ జట్టుకైనా అతిపెద్ద సవాలు అని, సొంత గడ్డపై భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోందని ఆయన విశ్లేషించారు.
ఓపెనింగ్ రేసులో ఇషాన్ కిషన్ దూకుడు
మరోవైపు, భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ స్థానం కోసం జరుగుతున్న ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య చర్చకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించారు. అమెరికాతో జరిగిన మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
గత ఐదు టీ20ల్లో ఇషాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, అతను బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 3 కంటే కిందకు వెళ్లడని స్పష్టం చేశారు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో శాంసన్ విఫలమవ్వగా, ఇషాన్ కిషన్ 231 స్ట్రైక్ రేట్తో చెలరేగి ఆడటం అతని అవకాశాలను మెరుగుపరిచింది.
లీడర్గా సూర్యకుమార్ కొత్త బాధ్యతలు
జట్టు నాయకత్వం గురించి సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అనే పదం కంటే లీడర్ అని పిలుచుకోవడమే తనకు ఇష్టమని ఆయన అన్నారు. స్వదేశంలో, ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించడం పట్ల ఆయన ఉత్సాహం వ్యక్తం చేశారు.
అమెరికా జట్టులో ఆడుతున్న భారత సంతతి ఆటగాళ్ల గురించి స్పందిస్తూ, వారితో కలిసి గతంలో ముంబైలో చాలా క్రికెట్ ఆడానని, వారికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రత్యర్థి జట్లు చిన్నవైనా, పెద్దవైనా తమ సన్నద్ధతలో ఎలాంటి లోటు ఉండదని, మైదానంలో ఎక్స్క్యూజ్లకు చోటు లేదని సూర్య అన్నారు.

