ఎవరీ మోను మనేసర్ ?హర్యానా మత ఘర్షణలతో అతనికి ఏం సంబంధం?
ఫిబ్రవరిలో భివానీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోను మనేసర్. సోమవారం నుహ్, గురుగ్రామ్లో మతపరమైన హింస చెలరేగిన తరువాత ఈ విషయం వెలుగు చూసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హర్యానా : ఈ ఫిబ్రవరిలో భివానీలో ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని హత్య చేయడంతో మోను మనేసర్ కు సంబంధం ఉంది. సోమవారం హర్యానాలోని నుహ్లో చెలరేగిన మత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు మరణించిన ఘటన తరువాత మళ్లీ ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు.
అయితే, ఇప్పుడు గురుగ్రామ్కు వ్యాపించిన మత హింసకు మోను మనేసర్ కు సంబంధం ఏమిటి? అతను ఎవరు?
హర్యానాలోని నుహ్లో విశ్వహిందూ పరిషత్ (VHP) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక పౌరుడు, ఒక ఇమామ్తో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
ఘర్షణలకు ఒక రోజు ముందు, మోను మానేసర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశాడు, తాను 'శోభా యాత్ర'లో పాల్గొంటానని ప్రజలు పెద్ద సంఖ్యలో చేరాలని కోరారు. అయితే, మనేసర్లో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో శోభాయాత్రఊరేగింపుకు అతను హాజరు కాలేదు.
మతఘర్షణల నేపథ్యంలో నుహ్, గురుగ్రామ్, సోహ్నా జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక్కడ గుంపులుగా జనాలు వెళ్లడంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. మతపరమైన ఊరేగింపుపై దాడులకు దారితీసిన కారణాలలో మోను మనేసర్ ఈ యాత్రలో పాల్గొనడం ఒక కారణమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే మోను మానేసర్ ఎవరు, ఎందుకు ఇంత వివాదాస్పదమయ్యారు?
మోను మనేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ బజరంగ్ దళ్ సభ్యుడు, గోసంరక్షకుడు. గురుగ్రామ్ సమీపంలోని మనేసర్ నుండి వచ్చాడు. హర్యానాలోని బజరంగ్ దళ్కు చెందిన గోరక్షా దళ్, గోసంరక్షణ టాస్క్ఫోర్స్కు అధిపతిగా ఉన్నాడు. వివాదాస్పద వ్యక్తిగా పేరొందాడు.
మోను మనేసర్ ఆవులను తరలించే వారిపై అతను డేగకన్ను వేస్తాడు. రాత్రివేళ తిరిగే అనుమానాస్పద వాహనాల గురించి సమాచారం సేకరించడం, దాన్ని పోలీసులకు అందించడంలో చురుగ్గా ఉంటాడు.
ఒకవేళ అతను సమాచారం ఇచ్చినా పోలీసులు ప్రతిస్పందించలేకపోతే, మోను మనేసర్ స్వయంగా తనసహచరులతో వెళ్లి దాడికి దిగుతారు. అనుమానితులను పట్టుకుని, చట్టానికి అప్పగిస్తారు. అయితే చాలాసార్లు మోను మానేసర్ చేసే పనులు వివాదాలకు, విమర్శలకు తావిచ్చేవిగానే ఉండేవి.
ఈ క్రమంలోనే మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యలో అతని ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్, జునైద్లను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి, మరుసటి రోజు హర్యానాలోని భివానీలోని లోహారులో వారి మృతదేహాలు కాలిపోయిన కారులో కనుగొనబడ్డాయి.
రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసి మోను మనేసర్ను నిందితుడిగా పేర్కొన్నారు. అయితే, మోను మనేసర్ కిడ్నాప్, హత్య ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు. మోను మనేసర్ కార్యకలాపాలు భౌతిక చర్యలకు మించి విస్తరించాయి. అతనికి యూట్యూబ్లో రెండు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, ఫేస్బుక్లో 83,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తరచుగా అతను, అతని బృందం అక్రమంగా పశువులను తీసుకువెళుతున్నట్లు అనుమానిస్తున్న వాహనాలను వెంబడించే వీడియోలను ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. ఇవి ఓ వైపు అతని ఫాన్ ఫాలోయింగ్ ను పెంచితే.. మరోవైపు అతని మీద ఉన్న వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, మోను మానేసర్కు సమాజంలోని కొన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, మనేసర్లో ఆయనకు మద్దతు తెలిపేందుకు హిందూ మహాపంచాయత్ నిర్వహించారు. మోను మానేసర్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్. కాలేజీలో ఉండగానే భజరంగ్దళ్లో చేరాడు.