- Home
- National
- Shubhanshu Shukla: శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి?
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి?
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 18 రోజుల మిషన్ పూర్తి చేసి విజయవంతంగా భూమిపైకి తిరిగివచ్చారు. అయితే, శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి? ఆ వివరాలు ఇప్పు డు తెలుసుకుందాం.

సురక్షితంగా భూమిపైకి శుభాంశు శుక్లా ఏం తీసుకొచ్చారు?
శుభాంశు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ గ్రేస్ క్యాప్సూల్ ద్వారా భూమికి విజయవంతంగా తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) లో 18 రోజుల మిషన్ పూర్తి చేశారు. ఆయనతో పాటు 264 కిలోల (580 పౌండ్ల) శాస్త్రీయ ప్రయోగాలకు సంబంధించిన అన్నింటిని ఆయన తీసుకొచ్చారు.
ఇందులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ఆధ్వర్యంలో నడిచిన ఏడు ప్రధాన ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, నమూనాలు కూడా ఉన్నాయి. అలాగే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) 31 దేశాల 60 ప్రయోగాల డేటా కూడా తీసుకొచ్చారు.
భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ ప్రయోగాల ద్వారా భారతదేశానికి పలు శాస్త్రీయ, సాంకేతిక ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో కండరాల పునరుత్పత్తి (Myogenesis-ISRO).. అంటే స్టెమ్ సెల్స్, మైటోకాండ్రియా మెటబాలిజం పై పరిశోధన వివరాలు. ఇది అంతరిక్షయాత్రికుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, వృద్ధాప్యము, ఇతర వ్యాధులతో కలిగే కండరాల ప్రభావంపై చికిత్సను అందించడంలో కీలక అంశాలను వెల్లడించనుంది.
ఎముకల ఆరోగ్యం, రేడియేషన్ మానిటరింగ్: ఈ ప్రయోగంలో ఆస్టియోపొరోసిస్ చికిత్సల అభివృద్ధి, రేడియేషన్ సురక్షిత చర్యల రూపకల్పన సాధ్యమవుతుంది.
వ్యవసాయం, జీవన వాతావరణంపై పరిశోధనలు
విత్తన మొలకలు: మైక్రోగ్రావిటీలో మొలకెత్తిన మినప, మెంతులు సహా ఆరు రకాల పంటలపై పరిశోధనలు జరిపారు. వీటి జెనెటిక్, పోషక విలువలు, మైక్రోబైయోమ్ మార్పులను విశ్లేషిస్తున్నారు. ఇది అంతరిక్ష వ్యవసాయం కోసం మౌలిక దశగా, భూమిపై ఎండారి ప్రాంతాల్లో సాగు చేయడంలో కీలకంగా ఉండనుందని భావిస్తున్నారు.
మైక్రో ఆల్గే, సైనోబాక్టీరియా: ఆహారం, ఆక్సిజన్ ఉత్పత్తి, కార్బన్, బయోఫ్యూయల్ సామర్థ్యాల పరిశీలన జరిగింది. ఈ అధ్యయనాలు ISRO గగనయాన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ రూపకల్పనలో సహాయపడతాయి.
బయోటెక్నాలజీ, ఎక్స్ట్రీమ్ జీవులపై పరిశోధనలు
టార్డిగ్రేడ్స్ పై పరిశోధన: రేడియేషన్, శూన్యంలో టార్డిగ్రేడ్స్ ఎలా జీవించగలుగుతాయన్న అంశంపై అధ్యయనం చేశారు. ఇది రేడియేషన్ షీల్డింగ్లోనే కాక, బయోమెడికల్, మెటీరియల్ సైన్స్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని భావిస్తున్నారు.
మనుషులు-టెక్నాలజీ పరిశీలన
డిస్ప్లేలు: మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో టచ్స్క్రీన్ లేదా చూపుతో ఆధారపడే కంట్రోల్ వ్యవస్థలపై యాత్రికులు ఎలా స్పందిస్తారో విశ్లేషించారు. ఇది భవిష్యత్తులో స్పేస్క్రాఫ్ట్ ఇంటర్ఫేస్లతో పాటు విమానయాన, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు, వీఆర్ అప్లికేషన్ల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఇస్రో , గగనయాన్లపై ప్రభావం
గగనయాన్ ప్రోగ్రాంకు ప్రాథమిక అధ్యయనం: ఈ మిషన్ ద్వారా ఇస్రో (ISRO)కు అంతరిక్ష సిబ్బంది శిక్షణ, ఆరోగ్య మానిటరింగ్, మిషన్ ప్లానింగ్, గ్రౌండ్-స్పేస్ సమన్వయం వంటి కీలక అనుభవాలు లభించాయి.
పరిశోధనల నిర్మాణం: ఈ ఏడు ప్రయోగాలు ISRO, భారతీయ పరిశోధనా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రయోగ నమూనాల విశ్లేషణకు ISRO నాయకత్వం వహించనుంది, దీని ఫలితాలు గగనయాన్ మిషన్ అవసరాలకు కీలకంగా మారతాయి.
శుభాంశు శుక్లా కేవలం శాస్త్రీయ నమూనాలు మాత్రమే కాక, భారత అంతరిక్ష పరిశోధనకు దోహదపడే కీలక పాఠాలను తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇది గగనయాన్, అంతరిక్ష వ్యవసాయం, జీవన వాతావరణ వ్యవస్థలు, అంతరిక్ష బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత స్థాయిని మెరుగుపరిచే ప్రాథమిక దశగా నిపుణులు పేర్కొంటున్నారు.