Cyber crime: వీడు మాములోడా కాదు.. సైబర్ నేరస్థుల నుంచే డబ్బులు వసూలు చేశాడు.
ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ పార్శిల్ వచ్చాయనో, అశ్లీల చిత్రాలు ఉన్నాయో రకరకాల మార్గాల్లో డబ్బులను కాజేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. చాలా మంది చదువుకున్న వారు, టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వారు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ కుర్రాడు మాత్రం సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించాడు. ఇంతకీ ఏం చేశాడంటే..

cyber crime
సైబర్ నేరస్థులు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజూ చోటు చేసుకుంటున్నాయి. అయితే కొందరు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తున్నారు. ఎవరికీ ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో అని భయపడుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా సైబర్ నేరస్థులనే బురిడి కొట్టించాడు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ అనే యువకుడికి ఇటీవల తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. తాను సీబీఐ అధికారినని, అశ్లీల వీడియోలు పంపించిన కారణంగా నీపై కేసు నమోదైందని తెలిపాడు. విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అలా కాకుండా ఉండాలంటే రూ. 16 వేలు ఇవ్వాలని హెచ్చరించాడు. డబ్బులు ఇస్తే ఎవరికీ తెలియకుండా కేసు విత్డ్రా చేస్తామని చెప్పుకొచ్చాడు.
దీంతో భూపేంద్ర అందరిలో భయపడలేదు. తెలివిగా ఆలోచించి నిజంగానే భయపడుతున్నట్లు నటించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, మీరు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తానని నమ్మబలికాడు. అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, కొన్ని రోజుల కిందట గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నానని తెలిపాడు. 'మీరు ఒక్క రూ. 3 వేలు పంపిస్తే.. వెంటనే బంగారాన్ని విడిపించి, అమ్మి డబ్బులు ఇస్తాను' అని చెప్పుకొచ్చాడు.
దీంతో స్కామర్ అదంతా నిజమే అనుకొని వెంటనే భూపేంద్ర అకౌంట్కి రూ. 3 వేలు పంపించాడు. అక్కడితో ఆగకుండా తాను మైనర్ ను కావడంతో గోల్డ్ చైన్ తిరిగివ్వడంలేదని, తన తండ్రిలా నటించి సదరు వ్యాపారిని ఒప్పించమంటూ తన స్నేహితుడి నెంబర్ ఇచ్చాడు. నగల వ్యాపారి పేరుతో భూపేంద్ర స్నేహితుడు మాట్లాడాడు. తాకట్టుకు సంబంధించిన మొత్తం డబ్బు ఇస్తే రూ. లక్ష అప్పు ఇస్తానని చెప్పాడు. దీంతో అత్యాశకు పోయిన స్కామర్ మరో రెండు దఫాలుగా రూ.4,480, రూ.3 వేలు పంపించాడు. ఇలా సుమారు మొత్తం రూ. 10 వేలు లాగేశాడు.
అయితే మోసపోయానని అర్థం చేసుకున్న స్కామర్.. డబ్బు తిరిగి ఇచ్చేయమని భూపేంద్రను, అతడి స్నేహితుడిని అడిగాడు. దీంతో భూపేంద్ర వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన భూపేంద్ర సింగ్.. మోసగాడి నుంచి తాను రాబట్టిన రూ.10 వేలను విరాళంగా ఇస్తానని మీడియాకు వెల్లడించాడు. ఇప్పుడీ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.