కొత్త పార్లమెంట్ భవనంలో మోడీ చెకింగ్.. కార్మికులతో ములాఖత్ (ఫోటోలు)
కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం పరిశీలించారు. దాదాపు గంటల పాటు పార్లమెంట్ భవనం ఆవరణలో తిరిగిన ఆయన పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పనివారితో మోడీ ముచ్చటించారు.
modi
కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పనులను ప్రారంభించింది. గత ఏడాదే ఈ ప్రాజెక్టు పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
modi
64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ. 971 కోట్లతో కొత్త భవనం రూపు దాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది. భూకంపాలకు సైతం చెక్కు చెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
modi
నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్, మొదటి, రెండు అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది. గుజరాత్ కు చెందిన హెచ్సీపీ సంస్థ ఆకృతి (డిజైన్) ని రూపొందించగా, టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది.
modi
నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షం గాను, 9 వేల మంది పరోక్షం గాను పాలు పంచుకుంటున్నారు. 200 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.
modi
కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మితం కానుంది.
modi
భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజన శాలలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.