- Home
- National
- Most Abusive States : తిట్ల పురాణంలో ఢిల్లీకి గోల్డ్ మెడల్.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటి?
Most Abusive States : తిట్ల పురాణంలో ఢిల్లీకి గోల్డ్ మెడల్.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటి?
Most Abusive States : భారతదేశంలో తిట్లు లేదా అత్యధికంగా అసభ్య పదజాలం వినియోగంపై జరిగిన తాజా సర్వేలో ఢిల్లీ 80 శాతంతో టాప్ లో నిలిచింది. పంజాబ్, యూపీ తర్వాతి స్థానాల్లో ఉండగా, కశ్మీర్లో అత్యంత తక్కువగా అసభ్య తిట్లను వాడుతున్నట్లు తేలింది.

దేశంలోనే తిట్లపురాణంలో ఢిల్లీ రికార్డు.. టాప్ 10 రాష్ట్రాల జాబితా ఇదే
భారతదేశంలో భాషా వైవిధ్యం ఎంత ఉందో, కొన్ని ప్రాంతాల్లో వాడుక భాషలో అసభ్యంగా తిట్లు కూడా అంతే సాధారణమైపోయాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కొన్ని పదాలు తిట్లుగా కాకుండా, మాటల్లో భాగంగా మారిపోయాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ సునీల్ జగ్లాన్ నేతృత్వంలోని 'గాలి బంద్ ఘర్ అభియాన్', 'సెల్ఫీ విత్ డాటర్ ఫౌండేషన్' సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఢిల్లీ అగ్రస్థానం.. తిట్ల రాజధానిగా గుర్తింపు
ఈ సర్వే ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 80 శాతం మంది రోజువారీ సంభాషణల్లో అసభ్య మాటలు, తిట్లు వాడుతున్నారు. ఒత్తిడి, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల సమయంలో ఢిల్లీ వాసులు విచ్చలవిడిగా తిట్లను ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది. ముఖ్యంగా అక్కడి తిట్లలో అమ్మలు, అక్కలను ఉద్దేశించి మాట్లాడే పదాలే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ "ఢిల్లీ అన్నింట్లోనూ ముందే ఉంటుంది" అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
తిట్ల పురాణం జాబితాలో నిలిచిన ఇతర రాష్ట్రాలు ఇవే
ఢిల్లీ తర్వాత పంజాబ్ 78 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్లో ఈ తిట్లు ఒక్కోసారి ఆత్మీయంగా అనిపించినా, అవి అసభ్య పదజాలం కిందకే వస్తాయని సర్వే తెలిపింది. 74 శాతంతో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. యూపీలో రాజకీయ సభల నుంచి ఆటస్థలాల వరకు అసభ్య పదజాలం వాడటం సర్వసాధారణమైపోయింది. హర్యానా (71%), రాజస్థాన్ (68%) కూడా ఈ జాబితాలో పైస్థానాల్లోనే ఉన్నాయి.
మహిళలు, యువతపై ప్రభావం
ఈ తిట్ల పురాణంలో పురుషులదే పైచేయి అయినప్పటికీ, దాదాపు 30 శాతం మంది మహిళలు కూడా అసభ్య పదాలు మాట్లాడుతున్నారని లేదా వాటిని భరిస్తున్నారని సర్వే వెల్లడించింది. ఇక జెన్జీ యువతలో 20 శాతం మంది తమ భాషలో అసభ్య పదజాలం పెరగడానికి ఓటీటీ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ కారణమని అంగీకరించారు. సినిమాల్లో, వెబ్ సిరీస్లలో అసభ్యంగా తిట్లు వాడటం ఫ్యాషన్గా మారడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
మహారాష్ట్రలో 58-61 శాతం మంది ముంబై, నాగ్పూర్ వంటి నగరాల్లో స్లాంగ్ రూపంలో అసభ్య పదజాలం వాడుతున్నారు. గుజరాత్లో 55-58 శాతం మంది తిట్లను ఉపయోగిస్తుండగా, మధ్యప్రదేశ్ (48-55%), ఉత్తరాఖండ్ (45%) రాష్ట్రాల్లో ఈ ప్రభావం కొంత తక్కువగా ఉంది. ఈ సర్వే ప్రధానంగా హిందీ, దాని మాండలికాలు మాట్లాడే ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇతక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా తిట్లను మాట్లాడుతారని తేలింది. ఏపీ 14వ స్థానంలో ఉండగా, ఇక్కడ 39 శాతం తిట్లు మాట్లాడుతారని తేలింది. ఇక తెలంగాణ 15వ స్థానంలో ఉంది. ఇక్కడ 38 శాతం అసభ్య పదజాలం మాటల్లో ఉంటోందని సర్వేలో వెల్లడైంది.
అత్యంత గౌరవప్రదమైన రాష్ట్రం ఏది?
దేశం మొత్తం ఒకవైపు ఉంటే, జమ్మూ కశ్మీర్ మరోవైపు నిలిచింది. ఈ జాబితాలో కశ్మీర్ కేవలం 15 శాతంతో చివరి స్థానంలో ఉంది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రజలు తమ భాషలో మాత్రం ఎంతో మర్యాదను, సంయమనాన్ని పాటిస్తారని సర్వే కొనియాడింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో 20-30 శాతం మాత్రమే తిట్ల వినియోగం ఉంది. అక్కడ మహిళలకు ఇచ్చే గౌరవం, మాతృస్వామ్య ప్రభావం వల్ల భాషాలో అసభ్య పదజాలం వాడకం తక్కువగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

