Rekha Gupta: ఎక్కువ రోజులు పాలించిన మహిళా ముఖ్యమంత్రి ఎవరో తెలుసా.?
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఢిల్లీలో మరోసారి మహిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కొందరు మహిళా ముఖ్యమంత్రుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chief Minister of Delhi, Rekha Gupta (Photo/ANI)
రేఖా గుప్తా:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచి సరికొత్త రికార్డును సృష్టించారు రేఖా గుప్తా. 1974 జూలై 19న జన్మించిన రేఖా గుప్తా, తన రాజకీయ ప్రయాణాన్ని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన దౌలత్ రామ్ కాలేజీలో ప్రారంభించారు. 1992లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరిన ఆమె, 1996లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
2007లో ఆమె ప్రధాన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తర్వాత ఆమె బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
అతిషీ మార్లెనా సింగ్:
ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు అతిషీ మార్లెనా. ఈమె సెప్టెంబర్ 21, 2024 నుంచి ఫిబ్రవరి 8, 2025 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో క్రీయాశీలకంగా పనిచేశారు అతిసీ. ఢిల్లీలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం, ప్రజా సేవలను మెరుగుపరిచే విధానాలను అమలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె పాలన సంస్కరణలు, సమగ్ర అభివృద్ధికి బలమైన నాంది పలికాయి.
మమతా బెనర్జీ:
మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా 2011లో నియమితులయ్యారు. సామాజిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అజెండాలతో మమతా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మహిళలు, అణగారిన వర్గాల కోసం ఆమె చేసిన కృషికి ప్రజాదరణ లభించింది. ఆమె నాయకత్వం ప్రజా సంక్షేమానికి అనుకూలంగా మారడంతో, ఆమె ప్రజాదరణ మరింత పెరిగింది. మమతా బెనర్జీ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు.
అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా పేరున్నా మమతా జీవనశైలి మాత్రం సాధారణంగా ఉంటుంది. ఎప్పుడూ తెల్ల చీరలు, హవాయి చప్పట్లు ధరించటం ఆమె ప్రత్యేకత. మమతా భారత్లో తొలి మహిళా రైల్వే మంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తన జీవితాన్ని పూర్తిగా ప్రజా సేవకే అంకితం చేశారు. ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు.
ఆనంది బెన్ పటేల్:
ఆనంది బెన్ పటేల్ 2014 నుంచి 2016 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. తన పాలనలో గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సామాజిక సంక్షేమ పథకాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి పదవీ కాలం ముగిసిన తర్వాత, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు.
వసుందర రాజే:
రాజస్థాన్లో అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు. ఆమె 2003 నుంచి 2008 వరకు, అలాగే 2013 నుంచి 2018 వరకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆమె నాయకత్వం ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సంక్షేమంపై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆమె ఎంతగానే కృషి చేశారు
ఉమా భారతి:
ఉమా భారతి 2003 నుంచి 2004 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె అధికార కాలం తక్కువే అయినా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయ విధానాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేశారు. ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. ఉమా భారతి తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేశారు. ఆమె పెళ్లి చేసుకోకుండా హిందూత్వ ప్రచారంతో పాటు సామాజిక సేవలో నిమగ్నమయ్యారు.
షీలా దీక్షిత్:
షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు దిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించి రికార్డు సృష్టించారు. ఆమె నాయకత్వంలో దిల్లీ ఒక ఆధునిక నగరంగా మారింది. ముఖ్యంగా మెట్రో రైలు వ్యవస్థలో మార్పులకు నాంది పలికారు. ఆమె పట్టణాభివృద్ధి, విద్యా, ఆరోగ్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఢిల్లీని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా మార్చారు. షీలా దీక్షిత్ చేసిన పనులు దిల్లీ పురోగతిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సుష్మా స్వరాజ్:
సుష్మా స్వరాజ్ 1998లో కొద్ది కాలం మాత్రమే దిల్లీ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అయితే, ఆమె తర్వాతి రాజకీయ జీవితంలో మరింత ప్రభావశీలంగా ఎదిగి, కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టారు. ముఖ్యంగా, 2014 నుంచి 2019 వరకు భారత విదేశాంగ మంత్రిగా అత్యంత ప్రజాదరణ పొందారు. తన సమర్థమైన నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు సహాయం అందించి, ఒక మంచి ప్రజా నాయకురాలిగా గుర్తింపు పొందారు.