రైళ్లలో దొంగతనం చేయాలంటే హడల్.. రైల్వే శాఖ సంచలన నిర్ణయం
రైల్వే బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. భద్రత పెంచే లక్ష్యంతో 74,000 బోగీలు, 15,000 లోకోమోటివ్లలో ఆధునిక కెమెరాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us

రైల్వే ప్రయాణికుల భద్రత
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచే దిశగా ఓ పెద్ద పథకాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 74,000 ప్యాసింజర్ బోగీలు, 15,000 సరుకు రవాణా లోకోమోటివ్లలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చనుంది. ఈ కెమెరాల వల్ల ప్రయాణ సమయంలో భద్రతతో పాటు నిఘా కూడా బలపడనుంది. రైలులో ఏం జరుగుతుందో వెంటనే సీసీ కెమెరాలో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. దీనివల్ల ప్రయాణికుల భద్రత, ఆస్తుల పరిరక్షణ మెరుగవుతుందని అధికారవర్గాలు తెలియజేశాయి.
స్పష్టమైన వీడియోలు
రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా కూడా ఈ కెమెరాలు స్పష్టమైన వీడియోలు రికార్డు చేయగలవు. తక్కువ కాంతి పరిస్థితుల్లోనూ పనిచేయగల అత్యాధునిక నైట్ విజన్ టెక్నాలజీ వీటికి ఉంటుంది. వీటిని STQC ప్రమాణాలతో రూపొందించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ కావడం విశేషం.
నాలుగు డోమ్ కెమెరాలు
ప్రతి బోగీలో నాలుగు డోమ్ కెమెరాలు అమర్చనున్నారు. ఇవి ప్రయాణికుల కదలికలు ఎక్కువగా ఉండే ప్రవేశ ద్వారాల వద్ద ఉండేలా ప్లాన్ చేశారు. అంటే ప్రతి బోగీలో రెండు డోర్లకు పక్కపక్కన రెండు కెమెరాలు ఉండేలా వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో జరిగే అనుమానాస్పద చర్యలను వెంటనే గుర్తించవచ్చు.
ట్రైన్ ఇంజన్లో ఆరు కెమెరాలు
లోకోమోటివ్ల విషయానికి వస్తే, ఒక్కో ట్రైన్ ఇంజన్లో ఆరు కెమెరాలు అమర్చనున్నారు. ఇందులో రెండు కెమెరాలు ఇంజన్ ముందు, వెనుక భాగాల్లో ఉంటాయి. మరో రెండు కెమెరాలు ఇంజన్ బాడీకి ఇరువైపులా డోమ్ టైప్గా ఉండేలా ప్లాన్ చేశారు. డ్రైవర్ క్యాబిన్లోనూ రెండు ప్రత్యేక కెమెరాలు ఉండబోతున్నాయి. వీటితోపాటు డ్రైవర్ సమీపంలో మైక్రోఫోన్తో కూడిన కెమెరాలు ఉంటాయి. దీని ద్వారా డ్రైవర్ చర్యలపై నిరంతర పర్యవేక్షణ చేయవచ్చు.
రికార్డింగ్ కోసం మాత్రమే కాదు
ఈ ప్రాజెక్టు అమలు చేసే ముందు ఉత్తర రైల్వే ప్రాంతంలో ప్రాథమికంగా కొన్ని బోగీలు, లోకోమోటివ్లలో ప్రయోగాత్మకంగా అమర్చారు. అక్కడి ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా ఇది అమలవుతుందనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ కెమెరాల వ్యవస్థ కేవలం రికార్డింగ్ కోసం మాత్రమే కాదు. భవిష్యత్తులో వీటి ద్వారా పొందిన డేటాను విశ్లేషించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇండియా ఏఐ మిషన్ భాగస్వామ్యంతో రైల్వే శాఖ ఈ పనిని చేపట్టనుంది. ప్రయాణ సమయంలో జరిగే అసాధారణ చర్యలపై అలర్ట్లు ఇవ్వగల టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నది వారి ఆలోచన. దీంతో ముందు జాగ్రత్త చర్యలు వేగంగా తీసుకునే అవకాశం లభిస్తుంది.
దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు
ఈ సాంకేతిక నూతనత ద్వారా రైళ్లలో జరుగుతున్న దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, మహిళలపై వేధింపులు వంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు నమ్ముతున్నారు. ప్రయాణికులకు భద్రతకే ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రణాళిక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. సీసీటీవీలతో రైళ్లలో భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.
సీసీటీవీ నిఘాలోకి
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దేశంలోని ప్రతి ప్యాసింజర్ బోగీ, లోకోమోటివ్ సీసీటీవీ నిఘాలోకి వస్తుంది. ప్రయాణికుల గోప్యతను కాపాడుతూ, అవసరమైన స్థలాల్లో మాత్రమే కెమెరాలను అమర్చడం జరుగుతుంది. ప్రయాణికులు ధైర్యంగా, భయాందోళనలు లేకుండా ప్రయాణించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇది భారత్లో రైలు ప్రయాణ భద్రతలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రయాణికుల సంతృప్తిని పెంచేందుకు టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ వంటి సేవలు డిజిటల్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు భద్రతా అంశాన్ని కూడా టెక్నాలజీ ఆధారంగా మరింత అభివృద్ధి చేయడం గమనార్హం. ఇలాంటి చర్యల ద్వారా భారతీయ రైల్వేలు అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా మారుతాయని ఆశలు ఉన్నాయి.