ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఏడాది పనిచేసినా చాలు గ్రాట్యుటీ వచ్చేస్తుంది
Gratuity: కార్మిక చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 కొత్త లేబర్ కోడ్లను ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు కొన్ని లాభాలు జరనున్నాయి.

కొత్త కార్మిక చట్టాల్లో గ్రాట్యుటీ కీలక మార్పు
భారత్ ప్రభుత్వం నవంబర్ 21న పాత 29 కార్మిక చట్టాలను ఒకే విధానంలోకి తీసుకువచ్చి 4 కొత్త లేబర్ కోడ్లు ప్రకటించింది. వీటిలో అత్యంత గుర్తించదగిన మార్పు గ్రాట్యుటీ (Gratuity)ను ఒకే ఏడాది సేవ తర్వాత పొందే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు ఉద్యోగి కనీసం 5 సంవత్సరాలు నిరంతర సేవ చేసిన తర్వాతే గ్రాట్యుటీ పొందేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం, కొందరు ఉద్యోగులు కేవలం 1 సంవత్సరం పని చేసినా అర్హత పొందగలరు.
గ్రాట్యుటీకి ఎవరు అర్హులు.?
ఈ కొత్త నిబంధన Fixed Term Employees (ఒప్పంద కాల ఉద్యోగులు) కు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఫిక్స్డ్ కాంట్రాక్ట్పై పనిచేసే ఉద్యోగులు, ఒక సంవత్సరం నిరంతర సేవ పూర్తి చేసిన వారు గ్రాట్యుటీ పొందడానికి అర్హులు. స్థిర ఉద్యోగులకు మాత్రం పాత నిబంధన వంటి 5 సంవత్సరాల సేవ నియమం కొనసాగుతుంది.
స్థిర ఉద్యోగులతో పోలిస్తే వేతనాల్లో మార్పులు ఉంటాయా.?
కొత్త లేబర్ కోడ్ ప్రకారం ఫిక్స్డ్ టర్మ్లో పనిచేసే ఉద్యోగులకు, స్థిర ఉద్యోగులతో సమానమైన జీతం, సదుపాయాలు ఇవ్వాలి. కనీస వేతనాల కన్నా ఎక్కువ జీతం, సెలవులు, వైద్య సదుపాయాలు, పని సమయాల నియంత్రణ వంటి హక్కులు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా పొందుతారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ సదుపాయాలు లభిస్తాయి?
కొత్త కోడ్ ప్రకారం, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా.. ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్ష వంటి సేవలను అందించాల్సి ఉంటుంది. దీంతోపాటు అనధికార (informal) ఉద్యోగాలను తగ్గించి, ఉద్యోగ వ్యవస్థను పటిష్టంగా మార్చడమే కొత్త నిబంధనల లక్ష్యం.
ఈ మార్పులు ఎవరికి వర్తిస్తాయి?
ఈ కార్మిక సంస్కరణలు కేవలం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకే కాదు, మరిన్ని విభాగాలకు కూడా వర్తిస్తాయి. వీటిలో ప్రధానంగా.. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, మహిళలు, MSME ఉద్యోగులు, డిజిటల్ మీడియా వర్కర్లు, ఐటి ఉద్యోగులు, మైనింగ్, టెక్స్టైల్, డాక్, ఎగుమతి రంగ ఉద్యోగులు, ప్రమాదకర రంగంలో పనిచేసే కార్మికులు ఇలా విస్తృత శ్రేణి ఉద్యోగులను ఈ లేబర్ కోడ్ వర్తిస్తుంది.

