Union Budget : ఉద్యోగులపై పన్ను భారం తగ్గుతుందా..?
uniin Budget 2026 : వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 కి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కేంద్ర శుభవార్త చెప్పే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే..

ఉద్యోగులపై డబుల్ ట్యాక్స్ రద్దు అవుతుందా..?
ఉద్యోగాలు చేసేవారు పీఎఫ్, గ్రాట్యుటీని అతిపెద్ద పొదుపుగా భావిస్తారు… ఈ డబ్బులు రిటైర్మెంట్ తర్వాత ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే సర్వీస్ లో ఉండగా ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బు చేతికి వచ్చినప్పుడు పన్నుల రూపంలో అధికంగా కట్ అయితే..? ఇదే భయం ప్రస్తుతం ఉద్యోగులను వేధిస్తుంది. అందుకే ఈ బడ్జెట్ లో అయినా పీఎఫ్-గ్రాట్యుటీపై విధించే డబుల్ ట్యాక్స్ రద్దు అవుతుందేమోనని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
డబుల్ ట్యాక్స్ నియమం ఏంటి?
ఉద్యోగి పీఎఫ్, ఎన్పీఎస్లో యజమాని వాటా ఏటా రూ.7.5 లక్షలు దాటితే ఆ అదనపు మొత్తంపై పన్ను విధిస్తారు. రిటైర్మెంట్ సమయంలో అదే మొత్తంపై మళ్లీ పన్ను పడితే దాన్ని డబుల్ ట్యాక్సేషన్ అంటారు.
డబుల్ ట్యాక్స్పై ఉద్యోగుల అసహనం
పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న మధ్యతరగతి ఉద్యోగులు, రిటైర్మెంట్ పొదుపుపై రెండుసార్లు పన్ను విధించడాన్ని అన్యాయంగా భావిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని ప్రతిసారి కోరుతున్నారు. డబుల్ ట్యాక్సేషన్ తో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ 2026 నుంచి ఏం ఆశిస్తున్నారు?
ఈ బడ్జెట్లో అయినా డబుల్ ట్యాక్స్ను తొలగించేలా ప్రభుత్వం స్పష్టమైన నియమాన్ని తీసుకురావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇది జరిగితే లక్షలాది మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.
పీఎఫ్, గ్రాట్యుటీపై డబుల్ ట్యాక్స్ తొలగిస్తే ప్రయోజనం ఏంటి?
బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఈ పన్ను ఉపశమనం కల్పిస్తే ప్రజల చేతుల్లో డబ్బు పెరుగుతుంది… తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది ఉద్యోగులకే కాదు దేశానికి కూడా లాభమేనని… ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంటున్నారు.
బడ్జెట్ 2026 నుంచి ఏమేం ఆశలు ఉన్నాయి?
ఇంకా ఈ బడ్జెట్ పై ప్రజల్లో అనేక ఆశలు ఉన్నాయి. పాత పన్ను స్లాబ్ల మార్పు, మహిళలకు పన్ను మినహాయింపు, గృహ రుణ వడ్డీ రాయితీ వంటి డిమాండ్లు ఉన్నాయి. కానీ పీఎఫ్, గ్రాట్యుటీ పన్ను అంశం రిటైర్మెంట్ భద్రతకు సంబంధించి చాలా ముఖ్యం. మరి బడ్జెట్ 2026 లో ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.

