Startup: ఆ విషయంలో అమెరికాకు పోటీనిస్తున్న ఇండియన్ ఐటీ సిటీ.. ఇంతకీ ఏంటా నగరం?
ప్రస్తుతం స్టార్టప్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు కంపెనీలు అంటే వేల కోట్ల పెట్టుబడులు, వందలాది మంది ఉద్యోగుల్లా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఐడియా ఉంటే చాలు చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్లోనే కంపెనీ మొదలు పెట్టేస్తున్నారు. కేవలం 10 మందితోనే కంపెనీలు రన్ అవుతున్న సంస్థలు కూడా ఉన్నాయి. భారత్లో కూడా స్టార్టప్ ట్రెండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారత దేశంలోని ఓ నగరం స్టార్టప్ల విషయంలో ప్రపంచదేశాల్లోని ప్రముఖ నగరాలతో పోటీనిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు అంతర్జాతీయంగా స్టార్టప్లకు స్వర్గధామంలా మారుతోంది. శాన్ఫ్రాన్సిస్కో లాంటి దిగ్గజ టెక్ నగరాలతో పోటీగా నిలుస్తోంది. తక్కువ జీవన ఖర్చులు, ప్రతిభావంతులైన యువత, వేగంగా పెరుగుతున్న పెట్టుబడులు బెంగళూరును స్టార్టప్లకు ఆదర్శవంతమైన గమ్యంగా మారుస్తున్నాయి.
“శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభించిన స్టార్టప్తో పోలిస్తే, బెంగళూరులో ప్రారంభిస్తే కంపెనీకి ఐదింతల ఎక్కువ సమయం లభిస్తుంది,” అని నిక్ లింక్ చెప్పారు. ఇంటి అద్దెతో పాటు లైఫ్స్టైల్ ఖర్చులు కలిపి కేవలం రూ.40 వేలు సరిపోతున్నాయని, దీంతో స్టార్టప్ కంపెనీలు తమ ఐడియాలను మరింత శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు.
2020లో ఒక్క ఏడాదిలోనే బెంగళూరు నగరానికి వచ్చిన పెట్టుబడులు $10 బిలియన్లను దాటాయి. ఇది శాన్ఫ్రాన్సిస్కో, లండన్లకన్నా ఎక్కువ. ఈ ఊపు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రముఖ గ్లోబల్ టెక్ నెట్వర్క్ "South Park Commons" తన మూడవ అంతర్జాతీయ కార్యాలయాన్ని కూడా బెంగళూరులో ప్రారంభించింది. ఇది నగర టెక్ స్థాయి ఎంత పెరిగిందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు.
ప్రారంభంలో సందేహించిన హర్దీప్ గంభీర్ వంటి ఫౌండర్లు ఇప్పుడు బెంగళూరునే తమ నిలయం చేసుకున్నారు. ఇక్కడ కలుసుకునే డ్రీమర్లు, క్రియేటర్లు, డిజ్రప్టర్లతో ఆయన ఇప్పుడుఅభిమానిగా మారిపోయారు. ప్రత్యేకించి ఏఐ రంగం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా ఎదుగుతోంది. Sarvam AI, KOGO OS, Krutrim AI, Karya AI లాంటి స్టార్టప్లు పల్లెటూర్లపై దృష్టి పెట్టిన వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.
IT
“బెంగళూరులో ఏఐ స్టార్టప్లు 1,000కు పైగా ఉన్నాయి,” అని కర్నాటక డిజిటల్ ఎకానమీ మిషన్ సీఈఓ సంజీవ్ కుమార్ గుప్తా తెలిపారు. ఇంకా ఇదంతా నగరానికి పరిమితం కాకుండా, "బియాండ్ బెంగళూరు" అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మైసూరు, హుబ్లీ, మంగళూరు వంటి నగరాల్లో కూడా టెక్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం ప్రపంచ టెక్ మ్యాప్లో తన స్థానాన్ని మరింత విస్తరిస్తోంది.