Beers Price Hike : చల్లచల్లని బీర్ పైనా ఇరాన్ వార్ సెగ.. ధరలు ఇంతలా పెరుగుతాయా..!
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు పెరిగాయి. అందుకే బీర్ల ధరలను 12-15% పెంచేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వానికి ప్రధాన ఆల్కహాల్ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

బీర్ల ధరలు పెంపు..
Beer Price Hike : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఇండియాను వంటగ్యాస్ కొరత వెంటాడుతోంది. ఇక చుట్టుపక్కల పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... దీంతో మనదగ్గర కూడా ధరలు పెరుగుతాయేమోననే ఆందోళన మొదలయ్యింది. ఇదే జరిగితే రవాణా ఖర్చు పెరిగి ఇతర వస్తువుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. సమ్మర్ లో ఎక్కువగా తాగే బీర్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది.. దీంతో ప్యాకేజింగ్ ధరలు పెరుగుతున్నాయి. ఇకపై బీర్ల ధరల పెంపు, సరఫరాలో అంతరాయాలు తప్పవని భారత్లోని గ్లోబల్ బ్రూవరీస్ (మందు తయారీ కంపెనీలు) హెచ్చరిస్తున్నాయి.
సీసాల ధరలు 20 శాతం పెంపు..
ఇరాన్ యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడటంతో గాజు సీసాల ధరలు 20% పెరిగాయి. పేపర్ కార్టన్ల రేట్లు రెట్టింపు అయ్యాయి. లేబుల్స్, టేపుల ధరలు కూడా పెరిగాయని 'బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' తెలిపింది. ఈ అసోసియేషన్ హైనెకెన్, ఏబీ ఇన్బెవ్, కార్ల్స్బర్గ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
బీర్ బాటిల్స్ కొరత..
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారుగా ఉన్న భారత్, మధ్యప్రాచ్యంపైనే ఎక్కువగా ఆధారపడింది. ముఖ్యంగా ఖతార్ నుంచి తన మొత్తం గ్యాస్ సరఫరాలో 40% దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ దాడితో ఖతార్ ఎగుమతులపై ప్రభావం పడి, భారత కంపెనీలకు గ్యాస్ లభ్యత కష్టంగా మారింది.
గాజు తయారీ పరిశ్రమలో కొలిములకు గ్యాస్ చాలా అవసరం. గ్యాస్ కొరతతో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వంటి గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి 40% తగ్గింది. ఇది కేవలం మందు బాటిళ్లకే కాక, జ్యూస్, కెచప్ బాటిళ్ల సరఫరాపైనా ప్రభావం చూపుతోంది.
బీర్ల ధరలు 15 శాతం పెరిగే అవకాశం..
భారత్లో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉండే 'పీక్ సమ్మర్' సీజన్లోనే ఈ సంక్షోభం మొదలైంది. అల్యూమినియం క్యాన్ల సరఫరాదారులు కూడా సప్లై తగ్గిస్తామని హెచ్చరించడంతో, మార్కెట్పై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో కార్యకలాపాలు కష్టంగా మారుతున్నాయని అసోసియేషన్ చెబుతోంది. బీర్ల ధరలను 12 నుంచి 15 శాతం పెంచేందుకు అనుమతి కోరాలని తమ సభ్య కంపెనీలకు సూచించింది.
ఇండియాలో బీర్ అమ్మకాలపై ఎఫెక్ట్...
2024లో భారత బీర్ మార్కెట్ విలువ 7.8 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ఈ మార్కెట్లో హైనెకెన్కు 50%, ఏబీ ఇన్బెవ్, కార్ల్స్బర్గ్లకు చెరో 19% వాటా ఉంది. అయితే బిరా, సింబా వంటి చిన్న కంపెనీలు తాజా సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నాయి.
వాటర్ బాటిల్ ధరలు పెంపు..
గ్యాస్, ప్లాస్టిక్ ధరల పెరుగుదల ప్రభావం 5 బిలియన్ డాలర్ల విలువైన భారత 'బాటిల్డ్ వాటర్' మార్కెట్పైనా పడింది. ప్లాస్టిక్ బాటిళ్లు, మూతల ధరలు పెరగడంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను 11% పెంచాయి.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ 'లొట్టె చిల్సంగ్ బెవరేజ్' కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తమ వద్ద కేవలం మూడు నెలల స్టాక్ మాత్రమే ఉందని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపింది. భారత్లో ఆల్కహాల్ తయారీ రంగంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ధరలు పెంచాలంటే 28 రాష్ట్రాల్లో మూడింట రెండొంతుల రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.

