శాండల్వుడ్ నటుడు, దర్శకుడు ఉపేంద్రపై అట్రాసిటీ కేసు.. క్షమాపణలు చెప్పిన హీరో..
ప్రముఖ శాండల్వుడ్ నటుడు, దర్శకుడు ఉపేంద్రపై ఆదివారం దక్షిణ బెంగళూరులోని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదైంది.

బెంగళూరు : కన్నడ నటుడు ఉపేంద్ర ఇటీవల ఫేస్బుక్ లైవ్ సెషన్లో దళితులపై వివాదాస్పద ప్రకటన చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉపేంద్ర ఆ వివాదాస్పద ప్రకటన చేసినప్పుడు తన రాజకీయ పార్టీ ప్రజాకీయ గురించి ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేసారు.
కన్నడ నటుడు ఉపేంద్రపై ఎఫ్ఐఆర్
ఉపేంద్రపై చెన్నమ్మన కెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫేస్బుక్ లైవ్ లో, అతను ఒక నిర్దిష్ట సంఘం పట్ల అభ్యంతరకరంగా భావించే భాషను ఉపయోగించాడు. తన రాజకీయ పార్టీ అయిన ప్రజాకీయ గురించి మాట్లాడుతున్నప్పుడు, నటుడు "ఒక పట్టణం ఉంటే, అక్కడ తప్పనిసరిగా దళితులు ఉంటారు" అని ఉటంకించారు.
దీనిమీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో వీడియోను తొలగించినట్లు కనిపిస్తుంది. ఉపేంద్ర మాట్లాడుతూ... “అమాయక హృదయం ఉన్న వారిలో మాత్రమే మార్పు జరుగుతుంది. అలాంటి నిష్కల్మశమైన హృదయం ఉన్నవారు మాతో కలవండి.. మనసు విప్పి మాట్లాడండి.. ఇదే కోరుకుంటున్నాను. వారి సూచనలు మనకు మేలు చేస్తాయి. వారు నిర్లక్ష్యంగా మాట్లాడరు. ఒకరిని అవమానించరు.
కొందరికైతే చేతిలో బోలెడంత సమయం ఉంటుంది. మనసులో ఏదనుకుంటేఅది వ్యాఖ్యానిస్తారు. అలాంటి వారిని ఏమీ చేయలేం. ఒక ఊరు ఉంటే అందులో దళితులు ఉంటారు. అదేవిధంగా, ఈ రకమైన వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాటిని ఉపేక్షిద్దాం. వాటిని పట్టించుకోవద్దు. దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించడమే’’ అన్నారు.
తన పార్టీ, ప్రజాకీయ గురించి విమర్శలు చేసిన వారిని ఉద్దేశించి ఉపేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని దళితులపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో పోల్చారు. ఈ ఫేస్ బుక్ లైవ్ ముగియగానే ఉపేంద్ర వ్యాఖ్యలు కర్ణాటకలోని రామనగరలో ఆగ్రహం, నిరసనలను రేకెత్తించాయి. అక్కడ నటుడు ఉపేంద్రపై దళిత అనుకూల సంస్థ నిరసన వ్యక్తం చేసింది. నిరసన దృశ్యాలలో సంస్థ సభ్యులు ఉపేంద్ర పోస్టర్ను తగులబెట్టడం కనిపిస్తుంది.
ఉపేంద్ర చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చాలా మంది కోపంగా ఉన్నారు. దీంతో ఉపేంద్ర మళ్లీ ఫేస్బుక్లోకి వచ్చి తన ప్రకటనకు క్షమాపణలు చెప్పారు. "అనుకోకుండా" ఆ వ్యాఖ్యలను చేశానని చెబుతూ.. “ఈరోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లైవ్లో, నేను అనుకోకుండా తప్పు ప్రకటన చేసాను. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలుసుకున్న వెంటనే, నా సోషల్ మీడియా నుండి ఆ వీడియోను తొలగించాను. నా ప్రకటనకు క్షమాపణలు కోరుతున్నాను'' అని రాశారు.
సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూధన్ కెఎన్ తన ఫిర్యాదులో శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో లైవ్ చాట్లో ఉపేంద్ర దళిత సమాజం మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. నటుడు 'ఊరిద్దారే హోలగేరి ఇరుత్తే' అని ఆరోపించారు. ఉపేంద్ర ఉద్దేశపూర్వక ప్రకటనపై ఉద్యమకారులు జి గోపాల్ గిరియప్ప, బనశంకరి నాగు, దళిత సంఘాల నుంచి డిపార్ట్మెంట్కు ఫిర్యాదు అందిందని మధుసూధన్ తెలిపారు.
upendra
వీడియో క్లిప్పింగ్ను తాను ధృవీకరించానని, ఉపేంద్ర అలాంటి ప్రకటన చేశాడని ధృవీకరించిన తర్వాత ఫిర్యాదు చేశానని మధుసూధన్ చెప్పారు. ఉపేంద్రపై కులతత్వం ఉందని, ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్సి మహదేవప్ప ఆదివారం ఆరోపించారు.