ఏటీఎంలో డబ్బులు తీసుకుంటే ఇక చార్జీల మోతే.. ఏ బ్యాంకు ఎంత వడ్డిస్తుందో తెలుసా..?
ATM Charges : మీరు ఆన్ లైన్ ట్రాన్సాషన్స్ కాకుండా ఏటిఎంలో డబ్బులు తీసుకుని వాడుకుంటారా..? అయితే మీకు బ్యాంకులు షాక్ ఇవ్వబోతున్నాయి. ఏప్రిల్ 1 నుండి ఏటిఎం రూల్స్ చేంజ్ కానున్నాయి.

ఈ బ్యాంక్ కస్టమర్స్ జాగ్రత్త...
Hyderabad : మరో వారంరోజుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది... కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఏటీఎం నగదు విత్డ్రా పరిమితులు, లావాదేవీల ఛార్జీలకు సంబంధించి కొన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఛార్జీల మోత మోగనుంది. హెచ్డిఎఫ్సి (HDFC), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంక్ తమ నిబంధనలను సవరించి ఖాతాదారులపై భారం పెంచేందుకు రెడీ అయ్యాయి. ఈ కొత్త నియమాలు వచ్చే నెల (ఏప్రిల్ 1, 2026) ఆరంభం నుండే అమలులోకి రానున్నాయి.
1. హెచ్డిఎఫ్సి బ్యాంక్ (HDFC Bank)
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ఏటీఎం లావాదేవీల లెక్కింపు పద్ధతిని మార్చింది. ఇప్పటివరకు ఏటిఎం కార్డు ద్వారా తీసే నగదును మాత్రమే పరిగణనలోకి తీసుకోగా, ఇకపై యూపీఐ (UPI) ద్వారా ఏటీఎం నుండి తీసే నగదును కూడా ఉచిత పరిమితిలో భాగంగానే లెక్కిస్తారు. అంటే ఏటిఎం నుండి నగదు విత్ డ్రా పరిమితిని తగ్గబోతోంది.
సాధారణంగా హెచ్డిఎప్సి బ్యాంక్ ఖాతాదారులు నెలకు 5 లావాదేవీలు (సొంత బ్యాంక్ ఏటీఎంలు) ఉచితంగా పొందవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే ప్రతి విత్డ్రాయల్పై రూ.23 కు పైగా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఇప్పటివరకు ఏటిఎం కార్డు లావాలేవీలే పరిగణలోకి తీసుకునేవారు.. ఇప్పుడు యూపిఐ లావాదేవీలు కూడా కౌంట్ చేస్తారట.
గమనిక : రాత్రి 7:30 గంటల తర్వాత చేసే లావాదేవీలను మరుసటి రోజు ఖాతాలో వేస్తారు. నెల చివరి రోజున రాత్రి 7:30 తర్వాత చేసే లావాదేవీలు తర్వాతి నెల కోటాలోకి వస్తాయి. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
హెచ్డిఎఫ్సి బాటలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నడుస్తోంది. పీఎన్బీ తన ప్రీమియం డెబిట్ కార్డుల ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని భారీగా తగ్గించింది. గతంలో ఉన్న రూ. 1 లక్ష పరిమితిని ఇప్పుడు రూ. 50,000 కు తగ్గించారు. రూపే ఎన్సీఎంసీ ప్లాటినం, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే పాలాష్, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం రైజ్ వంటి కార్డులకు ఈ కోత వర్తిస్తుంది.
3. బంధన్ బ్యాంక్ (Bandhan Bank)
బంధన్ బ్యాంక్ లావాదేవీల ఛార్జీలతో పాటు విఫలమైన ట్రాన్సాక్షన్లపై కూడా కఠిన నిబంధనలు తెచ్చింది. సొంత ఏటీఎంలో నెలకు 5 ఫైనాన్షియల్ లావాదేవీలు ఉచితం (నాన్-ఫైనాన్షియల్ అపరిమితం).
ఇతర ఏటీఎంలలో అయితే మెట్రోల్లో (హైదరాబాద్తో సహా) 3, నాన్-మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. ఈ ఉచిత పరిమితి దాటితే ఫైనాన్షియల్ లావాదేవీకి రూ. 23, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీకి రూ. 10 వసూలు చేస్తారు. ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ. 25 జరిమానా విధిస్తారు.
యూపీఐ లావాదేవీలు వాడుకొండి
నగదు లావాదేవీల వల్ల కలిగే అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఏటిఎంల వాడకాన్ని ఇప్పటికే ప్రజలు తగ్గించారు... తాజా నిబంధపనల కారణంగా వీటి వినియోగం మరింత తగ్గే అవకాశాలున్నాయి.

