- Home
- Entertainment
- Movie Reviews
- Gulebakavali Katha Review : ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినా.. టైటిల్స్ లో పేరులేదు, గులేబకావళి కథ సినిమా సక్సెస్ కు కారణాలు ఇవే?
Gulebakavali Katha Review : ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినా.. టైటిల్స్ లో పేరులేదు, గులేబకావళి కథ సినిమా సక్సెస్ కు కారణాలు ఇవే?
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన సినిమాల్లో గులేబకావళి కథ ఒకటి. ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ఈ సినిమాను ఎన్టీ రామారావు స్వయంగా డైరెక్ట్ చేశారు. కానీ ఆయన పేరు మాత్రం టైటిల్స్ లో వాడలేదు.

ఎన్.టి. రామారావు హీరోగా.. దర్శకుడిగా..
1962లో విడుదలైన "గులేబకావళి కథ" తెలుగు భాషలో రూపొందిన ఫాంటసీ స్వాష్బక్లర్ మూవీ. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను నేషనల్ ఆర్ట్ థియేటర్స్ బ్యానర్పై ఎన్. త్రివిక్రమరావు నిర్మించారు. ఈ సినిమా అరేబియన్ నైట్స్ జానపద కథల సమాహారంలో ఉన్న గులేబకావళి కథ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఎన్.టి. రామారావు, జమున హీరో హీరోయిన్లుగా నటించారు. నాగరత్న, రాజనాల లాంటి సీనియర్ నటీనటులుముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
గులేబకావళి కథ విషయానికి వస్తే..
ఈ సినిమా కథ పాటలీపుత్రం అనే రాజ్యంలో ప్రారంభమవుతుంది. ఈ రాజ్యాన్ని చంద్రసేన(ముక్కామల) అనే రాజు పాలిస్తుంటాడు. అతనికి గుణవతి (రుష్యేంద్రమణి) , రూపవతి( ఛాయాదేవి) అనే ఇద్దరు భార్యలు ఉంటారు. రాజు రెండవ భార్య రూపవతిపై అధిక ప్రేమ చూపుతాడు. వారికి ముగ్గురు కుమారులు ఉంటారు. రూపవతి సోదరుడు వక్రకేతు(రాజనాల) ఒక దుర్మార్గుడు. రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనే కుట్రలో అతను తన మేనల్లుళ్లను తన వశం చేసుకుంటాడు.
ఇక గుణవతి సంతానం లేక బాధపడుతూ శివునికి తపస్సు చేస్తుంది. ఆమె భక్తిని గమనించిన శివుడు ఆమెకు ఒక కుమారుడిని ప్రసాదిస్తాడు. ఆ బాలుడికి విజయుడు( ఎన్టీ రామారావు) అనే పేరు పెడతారు. కానీ ఈ విషయాన్ని చూసి వక్రకేతు అసూయతో కుట్రలు పన్నడం ప్రారంభిస్తాడు. జ్యోతిష్కులను ప్రలోభపెట్టి, రాజు తన కుమారుడిని చూస్తే కంటి చూపు కోల్పోతాడని చెప్పిస్తాడు. దీంతో రాజు భయపడి ఆ శిశువును దూరం చేయమని ఆజ్ఞాపిస్తాడు.
విజయుడు జన్మ రహస్యాన్ని ఎలా తెలుసుకున్నాడు..
వక్రకేతు ఆ బాలుడిని చంపాలని ఆదేశిస్తాడు. అయితే దైవ కృపతో ఆ శిశువు రక్షించబడి ఒక గొర్రెల కాపరి దంపతుల వద్ద పెరుగుతాడు. కాలక్రమేణా విజయుడు ధైర్యవంతుడైన యువకుడిగా ఎదుగుతాడు.ఇక వక్రకేతు మరో కుట్ర పన్నుతూ, రాజు చంద్రసేనను విషంతో క్రమంగా అంధుడిని చేస్తాడు. తదుపరి రోజు విజయుడు అనుకోకుండా రాజును చూసినప్పుడు, జ్యోతిష్కుల మాట నిజమైందని భావించి రాజు పూర్తిగా చూపు కోల్పోతాడు. ఈ పరిణామం విజయుడికి అనుమానాన్ని కలిగిస్తుంది. అతను రహస్యంగా కోటలోకి ప్రవేశించి తన జన్మ రహస్యాన్ని తెలుసుకుంటాడు.
అప్పుడు రాజు చూపును తిరిగి పొందడానికి ఒకే ఒక మార్గం ఉందని తెలుసుకుంటాడు. అది దేవలోకంలో పౌర్ణమి రోజున వికసించే "గులేబకావళి పువ్వు"ను తీసుకురావడం. దీంతో విజయుడు తనపై ఉన్న అపవాదును తొలగించుకోవడానికి ఆ పువ్వును తెచ్చేందుకు సంకల్పిస్తాడు. అతని తల్లి గుణవతి ఆశీర్వాదంతో అతను ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో అతని సవతి సోదరులు కూడా ఆ పువ్వు కోసం బయలుదేరుతారు.
గులేబకావళి కోసం సాహసయాత్ర..
ప్రయాణంలో ఒక గ్రామానికి చేరుకున్న విజయుడి సవతి సోదరులు.. యుక్తిమతి( జమున) అనే మాయగాళ్లైన జూదగాళ్లను కలుస్తారు. ఆమె మోసపూరితంగా వారిని జూదంలో ఓడించి బానిసలుగా మార్చుతుంది. ముగ్గురు యువరాజులు ఆమె చేతిలో చిక్కిపోతారు. విజయుడు వేషం మార్చుకొని ఆమెను జయించి, యుక్తిమతిని వివాహం చేసుకొని తన సోదరులను విముక్తి కల్పిస్తాడు.
ఈ క్రమంలోనే వారు ఒక ఋషిని అవమానిస్తారు. ఆ ఋషి కోపంతో వారిని రాళ్లుగా మార్చేస్తాడు. విజయుడు మాత్రం తన యాత్రను కొనసాగిస్తాడు. దైవ సహాయంతో అతను దేవలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఇంద్రుడి కుమార్తె బకావళిని( నాగరత్న) గాంధర్వ విధానంలో వివాహం చేసుకుంటాడు.
తర్వాత గులేబకావళి పువ్వును సరస్సు నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అపవిత్రత కారణంగా ఆ సరస్సు పేలిపోతుంది. దీనికి కారణం బకావళి అని భావించిన ఇంద్రుడు ఆమెను బంధిస్తాడు. విజయుడు పువ్వుతో భూమికి తిరిగి వచ్చి తన సోదరులను తిరిగి జీవితం ఇస్తాడు.కానీ వారు ద్రోహంగా అతనిని వెనుక నుంచి దాడి చేసి పువ్వును దొంగిలిస్తారు.
ఈలోగా వక్రకేతు రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని అందరినీ బంధిస్తాడు. విజయుడు ఒక దేవకన్య శాపాన్ని తొలగించడంతో ఆమె అతనిని తిరిగి దేవలోకానికి తీసుకెళ్తుంది. అక్కడ జరిగిన పరిణామాలను తెలుసుకుంటాడు.తన త్యాగంతో సరస్సును మళ్లీ పునరుద్ధరించేందుకు తన కళ్ళను అర్పిస్తాడు. కళ్లు కోల్పోయిన హీరో తన లక్ష్యాన్ని ఎలాచేరతాడు..? మళ్లీ చూపు సాధిస్తాడా? తన తండ్రికి చూపును ఇస్తాడా? చివరికి ఏమయ్యింది అనేది గులేబకావళి కథ సినిమా.
సినిమా ఎలా ఉందంటే..?
ఈ చిత్రం 1938లో వచ్చిన గులేబకావళి కథ తర్వాత అదే కథ ఆధారంగా రూపొందిన రెండవ తెలుగు చిత్రం. ఈ చిత్రంలో రచయితకు క్రెడిట్ ఇవ్వకుండా "కథా సేకరణ"గా త్రివిక్రమరావు పేరు చూపించారు. దర్శకుడిగా ఉన్నప్పటికీ ఎన్.టి. రామారావు తన పేరును టైటిల్స్లో చూపించలేదు.
విజయుడి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు విజయుడిగా అద్భుతమైన నటన కనబరిచారు. యువరాజు పాత్రలో ఆయన చూపించిన ధైర్యం, ఆవేశం,కరుణ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, దేవలోక సన్నివేశాల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలిచింది.
హీరోయిన్ పాత్రలో జమున యుక్తిమతిగా చురుకైన నటన ప్రదర్శించారు. ఆమె మోసం చేసే పాత్ర అయినప్పటికీ.. ఆతరువాత హీరోతో కలిసిపోయి మారిపోతుంది. తెలివైన, చురుకైన పిల్లగా.. జమున నటన సినిమా కథకు మరింత బలం చేకూర్చింది. బకావళి పాత్రలో నటించిన నాగరత్న తక్కువ డైలాగ్లతోనే ఆకట్టుకుంది. ఆమె పాత్రలోని అమాయకత్వం అందరిని ఆకట్టుకుంది.
ఇక విలన్ గా రాజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వక్రకేతు పాత్రలో చాలా గంభీరంగా కనిపించారు. ఆయన నటన కథలో ప్రతిస్పందనను పెంచింది. ముక్కమాల చంద్రసేనగా గంభీరతను చక్కగా చూపించారు. గుణవతి పాత్రలో రుష్యేంద్ర మణి ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించారు. ఇక ఛాయదేవి గడుసుతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రూపవతిగా ఆమె నటన అద్భుతం.
ఎన్టీ రామారావు చేసిన అద్భుతం..
ఈ చిత్రానికి సాంకేతికంగా ఉన్న బలం ఆ కాలానికి మించి ఉంది. దర్శకుడిగా ఎన్టీఆర్ తన ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉంటాయో.. ఈసినిమా ద్వారా చూపించారు. టీమ్ అంతటిని చూసుకుంటూ.. నటించడం అంత తేలికైన పని కాదు. కానీ ఎన్టీఆర్ ఈ పనిని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన రవికాంత్ నాగైచ్ అద్భుత దృశ్యాలను అందించారు.
దేవలోక దృశ్యాలు, ప్రకృతి సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చూపించారు. కళా దర్శకుడు కె. నరసింహరావు రూపొందించిన సెట్స్ సినిమా విజువల్ గ్రాండియర్ను పెంచాయి. ముఖ్యంగా దేవలోక సెట్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఎడిటింగ్ పరంగా కూడా సినిమా కట్టుదిట్టంగా ఉంటుంది. ఎస్.పి.ఎస్. వీరప్ప, జి. శివమూర్తి కథా ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా జాగ్రత్త పడ్డారు.
ప్రాణం పోసిన సంగీతం.. పాటలు చాలా ప్రత్యేకం..
ఇక ఈ సినినిమాకు సంగీతం ప్రాణం పోసిందని చెప్పవచ్చు. జోసెఫ్ - విజయ కృష్ణమూర్తి అందించిన స్వరాలు ఈ సినిమాకు ప్రధాన బలం. "నన్ను దోచుకొందువటే", "కలల అలలపై", "మదన సుందర నా దోరా" వంటి పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గేయరచయితగా సి. నారాయణరెడ్డి ఈ చిత్రంతో పరిచయం కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈసినిమా నుంచి ఆయన సినిమా ప్రయాణం మొదలయ్యింది.
ముగింపు..
గులేబకావళి కథ" విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ కాలంలో ఫాంటసీ జానర్లో వచ్చిన సినిమాలలో ఇది ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. దర్శకుడిగా ఆయన ప్రతిభను మరోసారి నిరూపించింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ సినిమాకు లభించాయి. అయితే ఎన్టీఆర్ దర్శకుడిగా తన పేరును ఎందుకు తెరపై వేయించలేదు అనేది మాత్రం.. సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఈసినిమాను చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

