Paan: కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండండి
Paan: మనదేశంలో ఎంతో మంది భోజనం చేశాక కిళ్లీ తినడం సంప్రదాయంగా వస్తుంది. రుచిలో కూడా కిళ్లీ అద్భుతంగా ఉంటుంది. కానీ కొంతమంతి దీన్ని వ్యసనంలా నిత్యం నములుతూనే ఉంటారు. భోజనం తర్వాత మీరు తినే స్వీట్ పాన్ కొంతమంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

కిళ్లీ లో పోషకాలు ఉంటాయా?
ఆయుర్వేదం ప్రకారం కిళ్లీ మంచిదే. ఇందులో వాడే తమలపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ సి, రిబోఫ్లేవిన్, కెరోటిన్, నియాసిన్, క్లోరోఫిల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కిళ్లీని సరిగ్గా తీసుకుంటే, శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. తమలపాకు, వక్క, సున్నం, సోంపు వంటి వాటితో పాన్ తయారు చేస్తారు. ఇలాంటి కిళ్లీ ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
కానీ కొంతమంది కిళ్లీలో పొగాకు వాడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. అలాగే స్వీట్ పాన్ను ప్రతిరోజూ తినే వాళ్లు ఉన్నారు. స్వీట్ పాన్లో చాలా చక్కెర, గుల్కంద్ వంటి తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. దీన్ని మధుమేహం ఉన్నవారు తింటే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తీయటి కిళ్లీ వీరు తింటే ప్రమాదం
గర్భం ధరించాక మహిళలు కిళ్లీ తినడం మంచిది కాదు. ముఖ్యంగా తమలపాకునే వీరు తినకూడదు ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరమే. అలాగే దంత సమస్యలు ఉన్నవారు కూడా స్వీట్ పాన్ తినకూడదు. పంటిలో పుచ్చు లేదా దంత క్షయం ఉంటే పాన్ తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. పంటి నొప్పి మొదలైపోతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు కూడా ఎలాంటి కిళ్లీని తినకూడదు. పాన్ తిన్న వెంటనే నీళ్లు తాగితే తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మందులు వాడేవారు ఎక్కువగా పాన్ తినవద్దు. ఇది కడుపు నొప్పికి కారణం కావచ్చు.
నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్
పొగాకు వాడిన కిల్లీ లేదా లేదా స్వీట్ పాన్ను ప్రతిరోజూ తినే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోజంతా కిళ్లీ నమలడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో ఇతర సమస్యలు మొదలవుతాయి.
బీపీ ఉన్నవారు?
కిళ్లీలో వాడే తమలపాకు ఘాటు గుణం పిల్లలకు, వృద్ధులకు హానికరం. కాబట్టి వారికి ఎప్పుడూ కిళ్లీ ఇవ్వకండి. హైబీపీతో బాధపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ కిళ్లీ తినకూడదు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, పొగాకు లేదా తమలపాకుతో కూడిన పాన్ రక్తపోటు పెరిగిపోతుంది.

