Grapes: ఇంటి పెరట్లోనే ద్రాక్షను సింపుల్గా ఇలా పెంచుకోవచ్చు, ట్రిక్స్ తెలుసుకోండి
Grapes: ద్రాక్షను పెంచడం కష్టమనుకుంటారు కానీ ఇంటి పెరట్లోనే ద్రాక్ష తీగలను సులువుగా పెంచవచ్చు. చిన్న పెరడులో లేదా కుండీలో కూడా ద్రాక్ష తీగను పెంచవచ్చు. ఎలా పెంచాలో సింపుల్ టిప్స్ లో తెలుసుకోండి.

ఇంట్లోనే ద్రాక్షను పెంచడం సులువే
ద్రాక్ష పండించాలంటే పెద్ద పొలం కావాలని.. అలా అయితేనే ద్రాక్ష తొటలు పెంచగలమని అనుకుంటారు. నిజానికి ద్రాక్ష తీగను మీ ఇంటి పెరట్లో… ఇంకా చెప్పారం బాల్కనీలోని పెద్ద కుండీలో పెంచినా చాలు. కాస్త శ్రద్ధ పెట్టి, సరైన పద్ధతులు పాటిస్తే మీద్రాక్ష తీగను సులభంగా పెంచవచ్చు. ద్రాక్ష తీగ పెరగడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఆ తీగకు సరైన ఆధారాన్ని అందిస్తే చాలు అది పైకి పాకుతూ వెళ్తుంది. మీకు హోమ్ గార్డెనింగ్ ఇష్టమైతే, ఇంట్లోనే ద్రాక్ష మొక్క పెంచుకోండి.
ముందుగా ద్రాక్ష, కుండీ ఎంచుకోండి
బాల్కనీలో లేదా మీ పెరట్లో ద్రాక్ష పండించాలనుకుంటేముందుగా చిన్న ప్రదేశంలో పెరిగే రకాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నర్సరీలో దొరికే 'టేబుల్ గ్రేప్స్' లేదా 'డ్వార్ఫ్ వెరైటీ'లు బాల్కనీ గార్డెనింగ్కు సరిపోతాయి. నర్సరీ నుంచి నాణ్యమైన, ఆరోగ్యకరమైన మొక్కను తెచ్చుకోవాలి.
ద్రాక్ష మొక్క వేర్లు లోపలివరకు బాగా విస్తరిస్తాయి, కాబట్టి దానిని పెద్ద, లోతైన కుండీలో నాటాలి. కనీసం 16-20 అంగుళాల కుండీని ఎంపిక చేసుకోవాలి. కుండీ కింద నీరు పోవడానికి రంధ్రాలు ఉన్నాయో లేదో చూసుకోండి.
ద్రాక్షకు కావాల్సిన మట్టి, ఎండ
ద్రాక్ష మొక్క తేలికగా ఉండే, నీరు నిలవని మట్టిలో బాగా పెరుగుతుంది. దీనికోసం 40 శాతం మట్టి, 30 శాతం కంపోస్ట్, 20 శాతం ఇసుక, 10 శాతం కోకోపీట్ కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమం వేర్లను బాగా పెరిగేలా చేస్తుంది. ద్రాక్ష మొక్క నాటిన తరువాత రోజుకు కనీసం 5-6 గంటలపాటూ ఎండతగిలేలా చూడాలి. ఎండ తక్కువగా ఉన్నా కూడా తీగ పెరుగుతుంది, కానీ పండ్లు తక్కువగా కాస్తాయి.
ద్రాక్ష పాకే తీగ కాబట్టి, దానికి పందిరి లాగా రెయిలింగ్ కట్టుకోవాలి. దీనివల్ల తీగ పైకి పాకుతూ మీ బాల్కనీకి అందాన్నిస్తుంది. ప్రతి 20-25 రోజులకు ఒకసారి సేంద్రియ ఎరువు లేదా వానపాముల ఎరువు వేయవచ్చు.
తక్కువ నీరు, ఎక్కువ తీపి
పండ్లు కాయడం మొదలుపెట్టాక రోజూ ఎక్కువ నీరు పోయకుండా, నీటిని కొద్దిగా పోయండి. దీనివల్ల పండ్లు ఎక్కువ నీటిని పీల్చుకోకుండా తియ్యగా మారతాయి. ఉల్లిపాయ తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. ఇది మొక్కకు సహజ పోషకాలను అందిస్తుంది. కీటకాలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ ఆకులపై తెల్లటి మచ్చలు లేదా ఫంగస్ కనిపిస్తే, 1 భాగం పాలు, 4 భాగాల నీటిని కలిపి స్ప్రే చేస్తే మంచిది.
అరటిపండు తొక్కలను 2-3 రోజులు నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కకు పోయండి. దీనిలో ఉండే పొటాషియం పండ్లు కాయడానికి సహాయపడుతుంది. దీనివల్ల ద్రాక్ష పండ్లు తియ్యగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

