- Home
- Life
- IRCTC North India Tour : రూ.16500కే 10 రోజుల ఉత్తరాది ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, పూరి, గయ యాత్ర
IRCTC North India Tour : రూ.16500కే 10 రోజుల ఉత్తరాది ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, పూరి, గయ యాత్ర
తెలుగు ప్రజలకు IRCTC బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలకు నేరుగా యాత్రను ప్రారంభించవచ్చు... కేవలం ఒక్క టికెట్ తో. ఈ టూర్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

తెలుగు ప్రజలకు సూపర్ ఛాన్స్..
IRCTC North India Tour : రుతుపవనాలు కేరళను తాకాయి కాబట్టి ఇక వేసవి ముగిసినట్లే. మెళ్లిగా వర్షాలు మొదలై రాబోయే రోజుల్లో జోరందుకుంటాయి... ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఇలా వర్షాల సమయంలో ఫ్యామిలీ అంతా ఏదైనా టూర్ కి వెళితే హాయిగా గడపవచ్చు. ఇలా ఆలోచించే తెలుగవారి కోసమే అన్నట్లుగా IRCTC (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఉత్తర భారతదేశ టూర్ ప్లాన్ రెడీ చేసింది. హైదరాబాద్ నుండి ప్రారంభమయ్యే ఈ ఆద్యాత్మిక యాత్ర ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ పట్టణాల మీదుగా సాగుతుంది. కాబట్టి తెలుగు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.
ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ ప్లాన్ ఇదే..
దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఉత్తర భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలని సందర్శించాలని భావిస్తుంటారు. అలాంటివాటిలో ఆ పరమశివుడు వెలిసిన వారణాసి (కాశీ), శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య, పూరి జగన్నాథ ఆలయం, ప్రయాగరాజ్, గయ వంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ఈ ఆలయాలన్నింటిని సందర్శించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటివారి కోసమే ఇండియన్ రైల్వేకు చెందిన సంస్థ ఐఆర్సిటిసి కేవలం రూ.16,500కే ఈ ఆలయాలను చుట్టివచ్చేలా యాత్ర ప్యాకేజీని తీసుకొచ్చింది. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు ఈ యాత్ర సాగుతుంది.
ఈ యాత్రలో ఒడిషాలోని పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం... బిహార్ గయలోని విష్ణుపాద ఆలయం... ఉత్తర ప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే ప్రసిద్ధ గంగా హారతిని చూసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఉత్తర ప్రదేశ్ లోనే అయోధ్య రామజన్మభూమి ఆలయం, హనుమాన్ గఢీ, సరయూ నది హారతి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి కూడా తీసుకెళ్తారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి అవకాశం...
ఈ యాత్ర కోసం 'భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు'ను ఏర్పాటు చేశారు. ఈ రైలు ఆగస్టు 4, 2026 లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుండి సికింద్రాబాద్కు రైళ్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడికి చేరుకుని ఈ యాత్రను ప్రారంభించవచ్చు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా రైల్వే స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఇలా తెలుగు ప్రజలందరు ఈ నార్త్ ఇండియా టూర్ అవకాశాన్ని సులభంగా వినియోగించుకోవచ్చు.
ప్రయాణికులు రైలు ఎక్కడానికి, దిగడానికి పలు స్టేషన్లలో అవకాశం కల్పించారు. తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం స్టేషన్లు... ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ టికెట్ ధరలివే..
ఉత్తరాది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రకటించిన భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలులో మీ బడ్జెట్కు తగినట్లు వివిధ క్లాస్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్లీపర్ క్లాస్ (ఎకానమీ) : ఒక్కొక్కరికి రూ. 16,500 (5-11 ఏళ్ల పిల్లలకు రూ. 15,400)
థర్డ్ ఏసీ (3AC) : ఒక్కొక్కరికి రూ. 25,600 (పిల్లలకు రూ. 24,300)
సెకండ్ ఏసీ (2AC) : ఒక్కొక్కరికి రూ. 33,400 (పిల్లలకు రూ. 31,800)
ఈ 10 రోజుల యాత్రలో కేవలం ప్రయాణం మాత్రమే కాదు అనేక సౌకర్యాలు ఉంటాయి. స్థానికంగా తిరగడానికి వాహనాలు, వసతి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం (శాకాహారం), టూర్ గైడ్ సేవలు, ప్రయాణ భీమా వంటి అనేక సౌకర్యాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ కి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి..?
- ఈ యాత్రకు టికెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్ సైట్ https://www.irctctourism.com/bgaurav?searchKey=&tagType=&travelType=Domestic§or=All&bdar=3 లింక్పై క్లిక్ చేయండి.
- IRCTC పేజీ ఓపెన్ కాగానే కిందకు స్క్రోల్ చేయండి... AYODHYA- KASHI: PUNYA KSHETRA YATRA WITH BAIDYANATH DHAM టూర్ ప్యాకేజీ కనిపిస్తుంది.
- కుడి వైపున ఉన్న 'బుక్ నౌ' బటన్పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ వివరాలను నమోదు చేయండి.
- మీరు ఏ స్టేషన్ నుంచి రైలు ఎక్కుతారో ఆ వివరాలు ఇవ్వండి.
- చివరగా, డబ్బులు చెల్లించి మీ టికెట్ను బుక్ చేసుకోండి.

