ఇమ్యూనిటీని పెంచడానికి ఏవేవో కాదు.. ఈ సూపర్ ఫుడ్స్ ను తినండి చాలు..
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఇది బలంగా ఉండాలంటే దీన్ని బలోపేతం చేసే ఆహారాలను తప్పకుండా తినాలి. అవేంటంటే..
మన శరీరం పూర్తిగా మనం తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసా? పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటేనే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం.. పోషకాలు లేని టేస్టీ టేస్టీ ఆహారాలను తింటే మన శరీరానికి వచ్చేదేమీ లేదు. పైగా లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడానికి, వాటిని ఎదుర్కోవటానికి పోషకాలు చాలా అవసరం. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి?
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు అధికంగా ఉండే, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల పెరుగుదల, నిర్వహణకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఫైబర్ ను చిన్న గొలుసు కొవ్వు ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఇది రోగనిరోధక కణాల పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరికాయ
ఉసిరికాయ విటమిన్ సి కి అద్బుతమైన వనరు. దీనిలో నిమ్మ లేదా నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ ఎ లు కూడా ఉంటాయి. ఉసిరికాయ చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాలగే కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె, మూత్రపిండాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన ఎనర్జీలెవెల్స్ ను పెంచుతుంది. అంతేకాదు శరీరంలోని కణజాల వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. మాంసకృత్తులతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఐరన్ కూడా దీనిలో ఉంటాయి. ఖర్జూరాలు చల్లగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూరాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇది ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. ఖర్జూరం తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ghee
నెయ్యి
నెయ్యి కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే నెయ్యిలో మోనోశాచురేటెడ్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బ్యూటిరిక్ ఆమ్లం వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 12 వంటి కరిగే విటమిన్లు కూడా ఉంటాయి. అందుకే దీన్ని అద్భుతమైన కిచెన్ మెటీరియల్ గా భావిస్తారు. ఈ పోషకాలన్నీ మంటను తొలగిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. నెయ్యి గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
శొంఠి
సహజ సమ్మేళనం జింజెరోల్ శొంఠిలో లభిస్తుంది. ఇది జీర్ణశయాంతర చలనశీలతకు ప్రయోజనంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
grapes
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలు రక్త నాణ్యత, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. ఈ కిస్ మిస్ లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి కూడా. ఎండుద్రాక్ష సహజంగా తీయగా ఉంటుంది. ఇది సహజ చక్కెర. దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అవసరాన్ని బట్టి సరైన మోతాదులో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మలబద్దకం సమస్యను కూడా తొలగిస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అలాగే ఎముకలను దృఢంగా చేస్తుంది. ఎండుద్రాక్షలు దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.