Accenture Layoffs: కొంపముంచిన ఏఐ.. 11,000 మంది ఉద్యోగులను తీసి పారేసిన యాక్సెంచర్
Accenture Layoffs: యాక్సెంచర్ ఏకంగా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. వారికి ఎలాంటి ఏఐ స్కిల్స్ లేకపోవడం వల్లే తీసిసినట్టు పేర్కొంది. అలాగే ఇకపై ప్రమోషన్లు కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వాడాల్సిందేనని తేల్చి చెప్పింది.

భారీగా లేఆఫ్లు
ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు ముఖ్యమైపోయింది. కానీ దీని వల్ల ఎంతో మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture), గత కొన్ని నెలల్లో సుమారు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతే కాదు ఇప్పుడు ఉద్యోగులకు మరో షాకింగ్ కండిషన్ కూడా పెట్టింది. ఇకపై ఏఐ (AI) టూల్స్ను సమర్థంగా వాడటం తెలిసిన వారికే కంపెనీలో ప్రమోషన్లు ఇస్తామని అని యాక్సెంచర్ యాజమాన్యం స్పష్టంగా ప్రకటించింది.
ఈ మెయిల్స్ ద్వారా సమాచారం
ఫైనాన్షియల్ టైమ్స్ (Financial Times) నివేదిక ప్రకారం, యాక్సెంచర్లోని అసోసియేట్ డైరెక్టర్లు (Associate Directors), సీనియర్ మేనేజర్లకు (Senior Managers) ఒక ఈ-మెయిల్ పంపారు. అందులో 'ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఇకపై కచ్చితం. అది మీ ప్రమోషన్ను నిర్ణయించే అత్యంత ముఖ్యమైన అంశం' అని అందులో తెలిపింది. మీరు ఏఐ వాడకపోతే, మీకు ప్రమోషన్ రాదని నేరుగా చెప్పేసింది.
వాడుతున్నారా? లేదా? చెకింగ్ కూడా
ఉద్యోగులు తమ రోజువారీ పనుల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారా లేదా అని చెక్ చేసేందుకు కూడా యాక్సెంచర్ ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఎన్విడియా (NVIDIA)తో కలిసి అభివృద్ధి చేసిన 'ఏఐ రిఫైనరీ' (AI Refinery) వంటి ఇంటర్నల్ టూల్స్లో ఉద్యోగులు ఎంతసేపు లాగిన్ అయ్యారు, ఏఐని ఎంతవరకు వాడుతున్నారనే డేటాను గమనిస్తోంది. అయితే, కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా ప్రభుత్వ ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఈ నిఘా నుంచి మినహాయింపు ఇచ్చారు.
మిగతా కంపెనీలు కూడా
యాక్సెంచర్ మాత్రమే కాదు, చాలా ప్రముఖ టెక్ కంపెనీలు ఇదే పని చేస్తున్నాయి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 2025 నుంచి ఏఐ వాడకం తప్పనిసరి అని తెలిపింది. గూగుల్ (Google) కూడా ఏఐని వాడని ఉద్యోగులు వెనుకబడిపోతారని సుందర్ పిచాయ్ హెచ్చరించారు. మెటా (Meta) ఉద్యోగుల ఏఐ వాడకాన్ని ట్రాక్ చేయడం ప్రారంభించింది.
గత ఏడాది కాలంలోనే అమెజాన్, టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), యాక్సెంచర్ వంటి కంపెనీలలో లక్షకు పైగా ఐటీ ఉద్యోగాలు పోయాయి. ఏఐ టెక్నాలజీ పనులను సులభతరం చేయడంతో, ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

