- Home
- Districts News
- Hyderabad
- Hyderabad: హైదరాబాద్ మెట్రోలో కీలక అడుగు.. ఈ ప్రాంతాల్లో భూములకు రెక్కలు రావడం ఖాయం
Hyderabad: హైదరాబాద్ మెట్రోలో కీలక అడుగు.. ఈ ప్రాంతాల్లో భూములకు రెక్కలు రావడం ఖాయం
హైదరాబాద్ మెట్రోలో మరో ముందడుగు అడుగు పడింది. రెండో దశకు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రానున్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా నగరంలో ప్రజా రవాణా మరింత బలోపేతం కానుంది. మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మూడు కొత్త కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.
మూడు కొత్త మెట్రో కారిడార్లు
రెండో దశలో నిర్మించనున్న మెట్రో కారిడార్లు నగర శివారులకు మెట్రో సేవలు చేర్చనున్నాయి.
కారిడార్ 9: శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు – 39.6 కిలోమీటర్లు
కారిడార్ 10: జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు – 24.5 కిలోమీటర్లు
కారిడార్ 11: జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు – 22 కిలోమీటర్లు
ఈ మూడు కారిడార్ల ద్వారా తూర్పు, ఉత్తర దిశల్లో మెట్రో ప్రయాణ సౌలభ్యం పెరిగే అవకాశం ఉంది.
ప్రాజెక్టు నిర్వహణ
ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు కానుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వాటా 30%, కేంద్ర ప్రభుత్వం వాటా 18%, అంతర్జాతీయ రుణాలు (JICA, ADB, NDB) 48%, పీపీపీ (ప్రైవేట్ భాగస్వామ్యం) 4%గా కేటాయించారు.
డీపీఆర్కు ఈ పరిపాలనా అనుమతిని జతచేసి త్వరలో కేంద్రానికి పంపనున్నారు. ఇది అమలుకు కీలకమైన దశగా అధికారులు పేర్కొంటున్నారు.
పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు నిధుల విడుదల
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం తొలి విడత నిధులుగా రూ.125 కోట్లు విడుదల చేసింది. 2025-26 బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లలో ఇది భాగం. ఈ నిధులతో పాతబస్తీ మెట్రో మార్గంలో పనులను వేగవంతం చేయనున్నారు. ఇది పాతబస్తీ ప్రజలకు మెట్రో ప్రయాణం అందించే దిశగా ముందడుగు.
మెట్రోతో రియల్ ఎస్టేట్ బూస్ట్?
హైదరాబాద్ మెట్రో విస్తరణ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రోతో భూముల ధరలు, అపార్ట్మెంట్ విలువలు పెరిగే అవకాశముంది. శామీర్పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు పెరుగుతాయి.
ముఖ్యంగా నగర శివారుల్లోకి నగరం నుంచి వేగంగా వెళ్లే సౌలభ్యం లభించడంతో.. ఈ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొత్తగా అపార్ట్మెంట్లు, విల్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా ఉద్యోగాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరగడానికి కారణమవుతుంది.