ATM: ఏటీఎమ్ ఉపయోగించే వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగింది. దీంతో మార్కెట్లో నగదు క్రమంగా తగ్గింది. ముఖ్యంగా ఏటీఎమ్లలో కేవలం రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, వచ్చే సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశంలోని 75% ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లను ఇవ్వాల్సిందేనని తెలిపింది. అయితే బ్యాంకులు ఇప్పటికే ఈ లక్ష్యానికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 73% ఏటీఎంలు ఈ చిన్న నోట్లను అందిస్తున్నాయి.
73 శాతానికి పెరిగిన నోట్లు
దేశంలో 2.15 లక్షల ఏటీఎంలలో 73 వేల ఏటీఎంలను నిర్వహిస్తున్న CMS ఇన్ఫోసిస్టమ్స్ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2024 డిసెంబర్ చివరిలో 65% ఏటీఎంలలోనే చిన్న నోట్లు లభించాయి. అయితే ఇప్పుడు ఈ సంఖ్యను 73 శాతానికి పెంచారు.
నగదు లావాదేవీల్లో చిన్న నోట్లదే కీలక పాత్ర
CMS సంస్థ క్యాష్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ అనుష్ రాఘవన్ ఈ విషయమై మాట్లాడుతూ.. "దేశంలో ఇప్పటికీ 60% వినియోగదారుల ఖర్చులు నగదు రూపంలోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100, రూ.200 నోట్లను అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు రోజువారీ ఖర్చులు తేలికగా నెరవేరతాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర సమస్యలు తీరుతాయిష అని చెప్పుకొచ్చారు.
90 శాతానికి పెంచేలా
ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75% ఏటీఎంలలో చిన్న నోట్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ సంఖ్యను 2026 మార్చి 31 నాటికి 90 శాతానికి పెంచాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు పెద్ద నోట్ల ఆధారిత ఏటీఎంల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం కోసం తీసుకొచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రాధాన్యత
చిన్న నోట్ల అవసరం ప్రధానంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అక్కడ ATM నుంచి రూ.500 లేదా రూ.2000 మాత్రమే వచ్చినప్పుడు చిల్లర సమస్య ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో చిన్న నోట్లు ఉంటేనే ప్రజలకు సౌలభ్యం కలుగుతుంది. దీంతో కిరాణా, టిఫిన్ సెంటర్లు, చిన్న వ్యాపారాలు నగదుతో సజావుగా నడుస్తాయి.