Narendra Modi : ప్రధాని మాట వింటే ఏం జరుగుతుంది...? వినకుంటే ఏం జరుగుతుంది..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు బంగారం కొనకుండా… పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడి… డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది..? ఆయన మాట వినకుంటే ఏం జరుగుతుంది..?

మోదీ చెప్పినట్లు వింటారా..?
ప్రధాని నరేంద్ర మోదీ దుబారా ఖర్చులు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు... ఇదే సమయంలో రూపాయి విలువ మరింత పతనమయ్యింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని, వీలైతే కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రధాని సూచించారు... వెంటనే పెట్రోల్ ధరలు పెరిగాయి. బంగారం కొనడం ఆపమని ప్రధాని కోరారు... వెంటనే పసిడి ధరలు జెట్ స్పీడ్ తో పరుగు అందుకున్నాయి. దీన్నిబట్టి ఓ విషయం అర్థమవుతోంది... మనకు తెలియకుండానే ఆర్థిక ప్రమాదం ముంచుకువస్తోంది. ఇది ముందే గుర్తించిన కేంద్రం ప్రధాని మోదీ నోట పొదుపు మంత్రం పఠింపజేసింది.
అయితే ప్రధాని మోదీ పిలుపు వెనకున్న అంతరార్థం ఏమిటి..? ఆయన చెప్పినట్లు చేయకుంటే ఏం జరుగుతుంది..? చేస్తే ఏం జరుగుతుంది...? దేశ ప్రజల భవిష్యత్ పై ప్రభావం ఎలా ఉంటుంది..? ఇలాంటి ఆసక్తికర అంశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది..?
రష్యా-ఉక్రెయిన్ యుద్దం, అమెరికా ఆంక్షలతో ముడి చమురు సంక్షోభం మొదలయ్యింది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దంతో ఇది మరింత ముదిరింది... హర్మూజ్ మార్గం గుండా చమురు నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడటంతో ఇది తారాస్థాయికి చేరింది. ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడింది... సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో తాజాగా దేశంలో పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి.
గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి లాభం లేదు. ఇంకా చెప్పాలంటే దీనివల్ల దేశం, దేశ ప్రజలు నష్టపోయి విదేశాలకు లాభం జరుగుతంది. ముడి చమురును డాలర్లలో కొనాలి కాబట్టి విదేశీ మారక నిల్వలు తరిగిపోతాయి. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ప్రధాని ఇంధనం పొదుపు చేయాలని కోరారు. కాదని అనవసర ప్రయాణాల కోసం ఇంధనం వాడిదే అది దేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తుంది.
బంగారం ఎక్కువగా కొంటే ఏం జరుగుతుంది..?
ఇండియాలో బంగారంను ఆస్తిగా భావిస్తుంటారు. అందుకే ఏ దేశంలో లేనివిధంగా ఇక్కడ బంగారం వినియోగం ఎక్కువ. అలాగని బంగారం ఇక్కడే ఉత్పత్తి అవుతుందా అంటే అదీ లేదు... 100 శాతం విదేశాల నుండే దిగుమతి అవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
గత ఏడాది బంగారం దిగుమతి బిల్లు 60 బిలియన్ డాలర్లు... అంటే విదేశీ మారక నిల్వలు తరిగిపోయాాయి అన్నమాటే. కానీ బంగారంను ఏడాది పాటు వాయిదా వేస్తే ఆ డాలర్లు దేశంలోనే మిగిలి రూపాయిని కాపాడతాయి. ఇది దేశానికి మేలు చేస్తుంది... కాదని బంగారం కొనుగోలు చేశామో ముప్పు కొనితెచ్చుకున్నట్లే.
భవిష్యత్ బాగుండాలంటే మోదీ మాట వినాల్సిందే..
"వెడ్ ఇన్ ఇండియా" (Wed in India) నినాదంతో విదేశీ గమ్యస్థానాల్లో పెళ్లిళ్లు, సెలవులను తగ్గించుకోమన్నారు ప్రధాని మోదీ. విదేశాల్లో ఖర్చు చేసే ప్రతి డాలర్ మన నిల్వలను తగ్గిస్తుంది. కాబట్టి పెళ్లిల్లు స్వదేశంలోనే చేసుకోవాలని, ఫారిన్ టూర్లు మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రధాని మాట వినకుంటే ధరలు మరింత పెరుగుతాయి... తద్వారా ఖర్చులు పెరుగుతాయి… దీంతో మరో ఆర్థిక సంక్షోభం తప్పదు.
టూత్పిక్ నుండి షూస్ వరకు విదేశీ వస్తువుల బదులు భారతీయ ఉత్పత్తులనే వాడాలని ప్రధాని కోరుతున్నాయి. ఇక ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి ఎలక్ట్రానిక్స్ (స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు) దిగుమతులపై కఠినమైన పరిమితులు లేదా లైసెన్సింగ్ తీసుకురావచ్చు. ఇలా ప్రజలు, ప్రభుత్వం కలిసి ముందుకు వెళితే దేశాన్ని ఎలాంటి సంక్షోభం నుండయినా కాపాడవచ్చు. మనం ఇప్పుడు చేసే చిన్న త్యాగం భవిష్యత్తులో రాబోయే పెద్ద ద్రవ్యోల్బణ షాక్ నుండి మనల్ని కాపాడుతుంది

