Petrol Price : స్వాతంత్య్ర సమయంలో ఇండియాలో పెట్రోల్ ధర ఎంతో తెలుసా?
ఇప్పుడు దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర సుమారు 100 రూపాయలు ఉంది… తెలంగాణలో అయితే రూ.115. డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కానీ 76 ఏళ్ల క్రితం అంటే స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మన దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉండేదో తెలుసా?

కేవలం చారాణకే లీటర్ పెట్రోల్..
దేశంలో రోజురోజుకి వాహనాల సంఖ్య పెరగడంతో పెట్రోల్, డీజిల్ కి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో వీటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర సెంచరీ క్రాస్ అయ్యింది… మరో ఐదు పదేళ్లలో డబుల్ సెంచరీ కొడుతుందా అనేంత వేగంగా ధర పెరుగుతోంది. బండిలో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటే కాదు వాటి ధరలు వింటేనే సామాన్యుడి గుండెలు అదిరిపోయే పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు ఇంధనం ధరలు ఇలా మండిపోతున్నాయి కానీ భారత స్వాతంత్య్ర సమయంలో చాలా తక్కువ ఉండేవట… ఒక్క రూపాయికి నాలుగు లీటర్ల పెట్రోల్ వచ్చేదట. 1947లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 27 పైసలుగా ఉండేది… అదే లీటర్ డీజిల్ 20 నుంచి 30 పైసలకే వచ్చేదట. ఆ కాలంలో వాహనాలు తక్కువగా ఉండేవి… కాబట్టి ధరలు కంట్రోల్ లో ఉండేవి. అంతేకాదు ప్రభుత్వం 'ప్రైస్ కంట్రోల్ సిస్టమ్' (నియంత్రిత ధరల విధానం) అమలు చేసేది… అందుకే ఇంధన ధరలు ఇంత తక్కువగా ఉండేవి.
ప్రభుత్వం చేతుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ..
స్వాతంత్య్రం తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించేది. దీనినే 'అడ్మినిస్టర్డ్ ప్రైసింగ్ మెకానిజం' (APM) అనేవారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావం నేరుగా సామాన్యులపై పడేది కాదు. పన్నులు కూడా ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉండేవి. చాలాకాలం ఇంధన ధరలు కంట్రోల్ లో ఉన్నాయి.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1989లో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.8.50, డీజిల్ ధర రూ.3.50గా మాత్రమే ఉండేది. ఆ తర్వాత 1990, 2000, 2010 తర్వాత ధరలు వేగంగా మారాయి. జూన్ 2010 నుంచి పెట్రోల్ ధరలను, అక్టోబర్ 2014 నుంచి డీజిల్ ధరలను మార్కెట్ ఆధారిత విధానంలో నిర్ణయించడం మొదలుపెట్టారు.
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు?
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఇంధన ధరలు నిర్ణయిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు, రవాణా, శుద్ధి ఖర్చులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను పరిగణనలోకి తీసుకుని ఏరోజుకారోజు ధరలను నిర్ణయిస్తాయి. అందుకే మార్కెట్కు అనుగుణంగా ధరలు మారుతుంటాయి.
ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గవు?
లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర ముడి చమురు ధర కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముడి చమురును ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటే సరిపోదు… దాని శుద్ధి ఖర్చులు, రవాణా ఛార్జీలు, డీలర్ కమీషన్లు, కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ కూడా కలిసి ఉంటాయి… అందుకే వినియోగదారుడికి చేరేసరికి ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోతాయి. అందుకే ఒక్కోసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తగ్గినా, రిటైల్ ధరలు అదే స్థాయిలో తగ్గవు.

