Facts : ఇండియాలో స్కూల్ టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏపీ, తెలంగాణలో ఎంతమంది?
భారతదేశంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? అందులో ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు? ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు? తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో టీచర్లు, స్టూడెంట్స్ సంఖ్య ఎంత?

దేశ జనాభాలో టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా?
Teachers : భారత దేశ జనాభా వందకోట్లు దాటింది... ఇందుకు తగ్గట్లుగానే టీచర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు... కాబట్టి వీరికి విద్యాబుద్దులు నేర్పే టీచర్లు కూడా అదే స్థాయిలో ఉంటారు. తాజాగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ టీచర్ల గురించి ఆసక్తికరమైన రిపోర్ట్ విడుదల చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా టీచర్ల సంఖ్య కోటి దాటిందని విద్యాశాఖ వెల్లడించింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ కోటి మంది టీచర్లలో 54.9 శాతం మహిళలే... అంటే 50 లక్షలకు పైగా మహిళా టీచర్లు ఉన్నారన్నమాట.
ఇండియాలో కోటిమంది టీచర్లు..!
దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, అందులో పనిచేస్తున్న టీచర్లు, స్టూడెంట్, విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర విద్యాశాఖ ఓ సర్వే నిర్వహించింది. ఈ వివరాలతో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) రిపోర్ట్ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం టీచర్ల సంఖ్య 1,01,22,420 మందిగా ఉన్నారు... ఇందులో మహిళలే ఎక్కువమంది ఉన్నారు.
గత విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల సంఖ్య కోటి కంటే తక్కువగా ఉండేది. కానీ ఈ విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే వివిధ రాష్ట్రాలు భారీగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకాలు చేపట్టాయి. ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్, వాటిలో టీచర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిటీ టీచర్ల సంఖ్య కోటి దాటింది. ఇది విద్యారంగంలో పురోగతిని సూచిస్తోంది. అయితే కోటి మందికిపైగా టీచర్లను కలిగివున్న ఇదే దేశంలో లక్షకు పైగా పాఠశాలలు ఇప్పటికీ ఒకే టీచర్తో నడుస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
ఇండియాలో స్కూల్ విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?
దేశంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన సుమారు 24.72 కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 14.67 లక్షల పాఠశాలలు పనిచేస్తున్నాయి. దేశంలోని పాఠశాలల్లో బాలికల నమోదు రేటు మెరుగుపడుతోందని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నారు. 'బేటీ బచావో- బేటీ పడావో' వంటి కార్యక్రమాల ద్వారా అమ్మాయిలను చదువుకు దగ్గరచేసే కార్యక్రమాలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వాటి ఫలితమే స్కూల్స్ లో బాలికల సంఖ్య పెరగడం.
తెలంగాణ, ఏపీలో టీచర్లు, స్టూడెంట్స్ సంఖ్య?
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పనిచేసే టీచర్ల సంఖ్య 3.5 లక్షలు ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.08 మంది గవర్నమెంట్ టీచర్లు పనిచేస్తున్నారు... మరో 2 లక్షలకు పైగా ప్రైవేట్ టీచర్లు ఉన్నారు.
ఇక తెలంగాణలో మొత్తం 40 వేలకు పైగా స్కూల్స్ ఉంటాయి...ఇందులో 74 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలే రాష్ట్రవ్యాప్తంగా 24,238 ఉన్నాయి.. ఇందులో 16 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే దాదాపు 50 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారన్నమాట. హైదరాబాద్ తో పాటు దీని చుట్టుపక్కల జిల్లాల్లోనే అత్యధిక స్కూల్స్ ఉన్నాయి.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 62 వేలకు పైగా స్కూల్స్ ఉన్నాయి...ఇందులో 43 వేల ప్రభుత్వ పాఠశాలలే. అన్ని స్కూల్స్ లో కలిపి 3 లక్షలమంది టీచర్లు పనిచేస్తున్నారు.... 70 లక్షల మంది విద్యార్థుల చదువుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారు 33 లక్షలమంది ఉన్నారు... మిగతావారంతా ప్రైవేట్ లో చదువుకుంటున్నారు.
దేశంలో అత్యధికమంది టీచర్లున్న రాష్ట్రాలేవి?
దేశవ్యాప్తంగా స్కూల్ టీచర్ల సంఖ్య కోటి, విద్యార్థుల సంఖ్య 24 కోట్లకు పైనే. రాష్ట్రాలవారిగా చూసుకుంటే అత్యధిక స్కూల్ టీచర్లను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్... ఇక్కడ విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. టీచర్ల సంఖ్య విషయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది... ఆంధ్ర ప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

