- Home
- Fact Check
- Viral Video: ప్రతి ఒక్క కుటుంబానికీ ఏటా 25లక్షలు.. నిర్మల సీతారామన్ పేరిట వచ్చిన వీడియోలో నిజమెంత
Viral Video: ప్రతి ఒక్క కుటుంబానికీ ఏటా 25లక్షలు.. నిర్మల సీతారామన్ పేరిట వచ్చిన వీడియోలో నిజమెంత
Viral Video: మారుతోన్నటెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. రోజుకో కొత్త స్కామ్తో ప్రజలను కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి పేరుతో పెద్ద మోసానికి తెరలేపారు.

నిర్మలా సీతారామన్ పేరుతో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలు
ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ వీడియోల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పెట్టుబడి పథకం గురించి ప్రచారం చేస్తున్నట్లు ఉంది. దేశంలోని ప్రతీ కుటంబానికి కేంద్రం రూ. 25 లక్షలు ఇవ్వనుందని చెబుతున్నట్లు ఉంది. వీడియోలో చెప్పినట్లు చేస్తే వచ్చే 24 గంటల్లోనే రూ. 80 వేలు మీ ఖాతాల్లోకి వస్తాయని వీడియోలో పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా డీప్ఫేక్ టెక్నాలజీతో తయారు చేసిన మోసపూరిత వీడియోలని స్పష్టమవుతోంది.
రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ
ఈ స్కీమ్లో చేరడానికి కొద్ది సమయం మాత్రమే ఉందంటూ వీడియోలో తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు ఉన్నాయి. ముందుగా ఎవరు రిజిస్టర్ అయితే వారికే డబ్బులు వస్తాయంటూ ప్రచారం చేశారు. పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. లింక్లను కూడా షేర్ చేస్తున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేశారో ఇక మీ పని అంతే అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డీప్ఫేక్ టెక్నాలజీతో పెరుగుతున్న సైబర్ మోసాలు
కృత్రిమ మేథస్సు ఆధారిత డీప్ఫేక్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు సైబర్ నేరాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రముఖుల ముఖం, స్వరం ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేయడం సులభమైంది. ఇలాంటి వీడియోలు నిజమైనవిగా కనిపించడంతో చాలామంది మోసపోతున్నారు. “చాలా తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు” అంటూ వచ్చే ఆఫర్లు ఎక్కువగా మోసాలే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడిదారులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన సూచనలు
పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు లేదా నమ్మకమైన ఆర్థిక సంస్థల వివరాలనే ఆధారంగా తీసుకోవాలి. చిన్న కాలంలో అసాధారణ లాభాలు ఇస్తామంటూ చెప్పే స్కీమ్స్పై నమ్మకం పెట్టకూడదు. అనుమానాస్పద లింక్స్పై క్లిక్ చేయడం, వ్యక్తిగత వివరాలు తెలియజేయడం నుంచి దూరంగా ఉండటం భద్రతకు మేలు చేస్తుంది.

