- Home
- Fact Check
- మమ్మీ.. నాతోని అయితలే నేను పోతున్నా. ర్యాంకులు, సీట్లేనే పిల్లల ఇష్టాలు పట్టవా? కంటతడి పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్
మమ్మీ.. నాతోని అయితలే నేను పోతున్నా. ర్యాంకులు, సీట్లేనే పిల్లల ఇష్టాలు పట్టవా? కంటతడి పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్
Mental Health: సమాజంలో పోటీ పెరుగుతోంది. ఉన్నత స్థానంలో ఉండడమే జీవిత పరమార్థం అన్నట్లు మారింది. దీంతో పేరెంట్స్ తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటున్నారు. ఇది మంచిదే అయినా కొందరిలో మాత్రం ఒత్తిడిని పెంచుతోంది.

విద్యార్థుల మానసివ ఆవేదనకు అద్దం పడుతోన్న ఘటన
హన్మకొండలోని నయీంనగర్ ప్రాంతంలో ఉన్న ఒక కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని (16) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరణానికి ముందు రాసిన లేఖలో ఆమె మానసిక వేదన స్పష్టమైంది. “Mommy…” అంటూ ఆంగ్లంలో మొదలైన లేఖలో తల్లిదండ్రులు తనను అర్థం చేసుకోలేదన్న బాధను వ్యక్తం చేసింది. చదువులో ఒత్తిడి, ఫెయిల్ అవుతానన్న భయం, తాను పడుతున్న మానసిక కుంగుబాటు కారణంగా ఇక జీవించడం కష్టమని పేర్కొంది. తన చెల్లెలు ఇలాంటివి ఎదుర్కోకూడదని చివరి కోరికగా తల్లిదండ్రులను వేడుకుంది.
KNOW
కంటతడి పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్
శివాని రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలను సమాజంపై సంధిస్తోంది. ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే.. "మమ్మీ చెల్లిని బాగా చదివించండి. మంచి కాలేజీలో, మంచి గ్రూప్ తీసుకోమను. నాలాగా అర్థం కానీ చదువు వద్దు. దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగ ఉండండి. కాలేజీలో జాయిన్ చేసేముందు ఎవరినైనా కొంచం అడిగి జాయిన్ చేయండి. చెల్లె నువ్వు కూడా మంచిగా చదుకుకోవే.. ఆ చదువు నాకు అర్థం ఐతలే.. మీకు చెప్తే మీరు అర్థం చేస్కుంటలే.. నాకు మొత్తం టెన్షన్ ఐతాంది. మైండ్ పోతాంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే, నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే చివరికి నాకు చావే దిక్కు అయ్యింది. ఏం అర్థం కాకా మధ్యలో నలిగి పోతున్నా.. ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారు అని ఏదోలా కిందా మీద పడి ఉన్నా.. ఇగ నాతోని కాదు, నేను వెళ్లిపోతున్నా.. నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను, మీరూ తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నా.. అందరు జాగ్రత్త. మంచిగా ఉండండి.. ఈ ఒక్క సంవత్సరం కూడా మీకోసమే చదివిన అయినా నాతోని అయితలే ఎంత కష్టపడ్డ రావడం లేదు. అందరూ జాగ్రత్త" అంటూ రాసుకొచ్చింది.
చదువు అర్దం కావట్లేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని
హన్మకొండ జిల్లా నయీంనగర్లో హాస్టల్లో ఉంటూ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శివాని
ఇంటర్లో తీసుకున్న గ్రూప్ వల్ల చదువు అర్దం కావట్లేదని.. రూంలో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న శివాని pic.twitter.com/mAvEFs35lu— Telugu Scribe (@TeluguScribe) August 3, 2025
చదువు ఒత్తిడి
ఈ విద్యార్థిని సూసైడ్ లెటర్ సమాజానికి ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. నేటి విద్యా విధానం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెడుతోందని స్పష్టమవతోంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో పోటీ పెరిగిన నేపథ్యంలో “టాప్ ర్యాంక్ రావాలి”, “మెడికల్ లేదా ఇంజనీరింగ్లో సీటు రావాలి” అనే లక్ష్యాలతో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రతి పిల్లవాడి మానసిక సామర్థ్యం ఒకేలా ఉండదు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA) రిపోర్టు ప్రకారం, చదువు ఒత్తిడి క్రమంగా డిప్రెషన్, ఆందోళన (Anxiety), నిద్రలేమి (Insomnia) వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. ప్రతి గంటకు కనీసం ఒక్కరు విద్యార్థి ఇండియాలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2022లో దేశవ్యాప్తంగా 13,000 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు NCRB నివేదికలో పేర్కొంది.
తల్లిదండ్రుల అంచనాలు – పిల్లలపై మోపే భారాలు
తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్ప స్థాయికి చేరాలని కోరుకోవడం సహజం. కానీ “మన పిల్లకు ఈ కోర్సు నచ్చుతుందా?”, “దీని కోసం అతను/ఆమె సిద్ధంగా ఉందా?” అన్న ప్రశ్నలు అరుదుగా ఆలోచిస్తారు. మానసిక వైద్య నిపుణుడు డా. బి. చిన్నకృష్ణ (ఎంజీఎం ఆసుపత్రి) చెబుతున్నట్లు.. “పిల్లలు ఆసక్తి చూపని రంగంలో వారిని బలవంతపెడితే, ఆ ఒత్తిడి మొదట్లో కనబడకపోయినా క్రమంగా మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది.” అని చెప్పుకొచ్చారు.
ఆత్మహత్య ఆలోచనలు ఎలా గుర్తించాలి.?
విద్యార్థులు మానసిక ఒత్తిడిని బయట పెట్టలేకపోతే స్వీయ నింద భావం (Self-blame), ఫేయిల్ అవుతాం అన్న భయం (Fear of failure) పెరుగుతాయి. చివరికి “చావడమే పరిష్కారం” అన్న తప్పుడు ఆలోచనలకు దారితీస్తాయి. నిపుణుల ప్రకారం, మానసిక ఒత్తిడికి 3 ప్రధాన సంకేతాలు ఉంటాయి:
చదువులో ఆసక్తి తగ్గడం:
* ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు
* నిరాశా వాక్యాలు ఎక్కువగా మాట్లాడడం
ఈ సంకేతాలు గమనించిన తల్లిదండ్రులు వెంటనే పిల్లలతో మాట్లాడి ఓదార్చడం అత్యవసరం. వీలైతే మంచి మానసిక నిపుణులకు చూపించాలి.
విద్యాసంస్థల బాధ్యత ఏంటి.?
విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు కేవలం కుటుంబ బాధ్యతే కాకుండా, కళాశాలల బాధ్యత కూడా ఉంటుంది. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, వారానికోసారి స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ నిర్వహించడం అవసరం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ చూపి, “అంకెలే అన్నీ కావు, జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి” అనే అవగాహన కల్పించాలి.
ఒత్తిడి తగ్గించే మార్గాలు, శాస్త్రీయ ఆధారాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 రిపోర్ట్ ప్రకారం కనీసం 7-8 గంటల నిద్ర మానసిక స్థిరత్వానికి అవసరం. విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజువారీ 30 నిమిషాల వ్యాయామం సెరోటోనిన్ (Serotonin) హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. పిల్లలతో పేరెంట్స్ ప్రతిరోజూ 15 నిమిషాలు అయినా మాట్లాడి వారి భావాలను తెలుసుకోవాలి.