- Home
- Business
- Fact Check: ఎస్బీఐ పీఎన్బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Fact Check: ఎస్బీఐ పీఎన్బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Fact Check : ఎస్బీఐ పీఎన్బీ కెనరా బ్యాంకులు విలీనం కాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. నిజంగానే ప్రభుత్వం ఈ బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

SBI, PNB, Canara Bank Merger : మూడు పెద్ద బ్యాంకుల విలీనం నిజమేనా? PIB సంచలన ప్రకటన!
సోషల్ మీడియాలో ఈ మధ్య ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాజాగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేశంలోని మూడు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ (Canara Bank) లు ఒకే బ్యాంకుగా విలీనం కాబోతున్నాయనేది ఆ వార్త సారాంశం. ఈ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కోట్లాది మంది కస్టమర్లు ఈ న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
వైరల్ అవుతున్న వార్త ఏంటి?
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒక పేపర్ క్లిప్పింగ్ లాంటి గ్రాఫిక్ ఇమేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాసి ఉంది. ఈ మూడు బ్యాంకులు కలిసి దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతున్నాయని, ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందంటూ ఆ ఇమేజ్లో పేర్కొన్నారు. ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన రిపోర్ట్లా దీన్ని డిజైన్ చేయడంతో జనాలు ఇది నిజమే అని నమ్మి షేర్ చేయడం ప్రారంభించారు.
రంగంలోకి దిగిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఈ వైరల్ న్యూస్ దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) రంగంలోకి దిగింది. పీఐబీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ వింగ్ ఈ వైరల్ క్లెయిమ్ను పూర్తిగా ఖండించింది. తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వైరల్ ఇమేజ్ను షేర్ చేస్తూ, దానిపై పెద్ద అక్షరాలతో ఫేక్ అని స్టాంప్ వేసింది. ఈ బ్యాంకుల విలీనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను ఆమోదించలేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఏమని క్లారిటీ ఇచ్చింది?
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయంపై స్పందిస్తూ.. "సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ వస్తున్న వార్త పూర్తిగా అబద్ధం" అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్ పూర్తిగా నకిలీదని, ఏ అధికారిక ప్రభుత్వ గెజెట్ లేదా నిజమైన వార్తాపత్రికకు దీనితో సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) కానీ ఇలాంటి విలీనానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదని తెలిపింది.
ఆర్బీఐ అధికారిక వెబ్సైట్నే నమ్మండి
బ్యాంకులకు సంబంధించిన ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో సోషల్ మీడియా వార్తలను బ్లైండ్గా నమ్మవద్దని పీఐబీ ప్రజలను కోరింది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ అయిన rbi.org.in ను మాత్రమే సందర్శించాలని సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అనుమానాస్పద సమాచారం కనిపించినా వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్కు రిపోర్ట్ చేయాలని కోరుతూ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను షేర్ చేసింది.
గతంలో 2020 ఏప్రిల్ 1న కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు విలీనమైన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా బ్యాంకుల మెగా విలీన వార్త మాత్రం ఫేక్ న్యూస్ మాత్రమే.

