మహేష్ డుమ్మా కొట్టాడెందుకూ..?
వరుస విజయాలతో జోరుమీదున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఇబ్బందిపడ్డ ఆయన భరత్ అనే నేను మూవీతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తరువాత మహర్షితో మరో హిట్ అందుకున్నారు. ఇక మహేష్ 2020 సంక్రాంతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.
హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న మహేష్, దర్శకుడు పరుశురామ్ చెప్పిన కథను ఒకే చేశారు. సర్కార్ వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.హైదరాబాద్ కెపిహెచ్ బి కాలనీలోని విశ్వనాథ స్వామి దేవాయలంలో ప్రారంభం అయ్యింది.
మహేష్ గారాల పట్టి సితార క్లాప్ కొట్టగా, నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విశ్వనాథ ఆలయంలో ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. 2021 జనవరి నుండి సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
దర్శకుడు పరుశురామ్ తో పాటు, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీ ఆచంట ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో మహేష్ సర్కారు వారి పాట లాంఛింగ్ ప్రోగ్రామ్ కి హాజరుకాకపోవడం విశేషం.
హైదరాబాద్ నగరంలోనే ఉన్న మహేష్ తన సినిమా లాంఛింగ్ కి హాజరుకాకపోవడం ఆశ్చర్య పరిచింది. మహేష్ తరుపున భార్య నమ్రత, కూతురు సితార హాజరయ్యారు. ఇటీవలే విదేశీ టూర్ ముగించుకొని వచ్చిన మహేష్ హైదరాబాద్ లోనే ఉన్నారు.
మరే ఇతర చిత్రాల షూటింగ్ కూడా మహేష్ కి లేదు. ఆయన ఎనిమిది నెలలుగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి మహేష్ ఏ కారణాల చేత సర్కారు వారి పాట లాంఛింగ్ కి రాలేకపోయారనేది అర్థం కాలేదు.
ఒకవేళ మహేష్ ఆరోగ్య కారణాల చేత ఈ కార్యక్రమానికి హాజరుకాలేదేమో అని కొందరు భావిస్తున్నారు. ఐతే ఇది కేవలం సెంటిమెంట్ కోసమే అని తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ తన చిత్రాల లాంఛింగ్ ప్రోగ్రామ్స్ కి హాజరుకారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా ఈ వేడుకకు అటెండ్ కాలేదు.
కాగా దర్శకుడు పరుశురామ్ సర్కారు వారి పాట మూవీని సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఆర్థిక నేరాలు ప్రధానంశంగా తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ రోల్ విభిన్నంగా ఉంటుందట. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.