- Home
- Entertainment
- Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Indian Idol 16 Winner: 10 నెలల జర్నీ.. కోట్లాది మంది హృదయాలు గెలిచిన ఒడిషా సింగర్ జ్యోతిర్మయి.. ఇండియన్ ఐడల్ 16 టైటిల్ను సాధించింది. జ్యోతిర్మయి నాయక్ ఎంత ప్రైజ్ మనీ అందుకుందో తెలుసా?

10 నెలల పోరాటం.. ఇండియన్ ఐడల్ 16 కింగ్ జ్యోతిర్మయి
బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీసన్ 16' విజేత ఎవరో తెలిసిపోయింది. సుదీర్ఘంగా 10 నెలల పాటు సాగిన ఈ పోటీలో ఒడిషాకు చెందిన 24 ఏళ్ల జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో తన అద్భుతమైన పాటలతో అందరినీ ఆకట్టుకుని 'ఇండియన్ ఐడల్ 16' ట్రోఫీని ముద్దాడారు.
విజేతగా నిలిచిన ఆమెకు ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది. జబల్పూర్ ప్రాంతానికి చెందిన తనిష్క్ శుక్లా రన్నరప్గా నిలిచారు. ఈ షోకు శ్రేయా ఘోషాల్, విశాల్ దాద్లానీ, బాద్షా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈసారి ‘యాదోంకీ ప్లేలిస్ట్’ అనే థీమ్తో వచ్చిన ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మ్యూజిక్ థెరపీతో హీలింగ్.. క్యాన్సర్ పేషెంట్లకు క్రెడిట్
ఒడిషాలోని నీలగిరి బ్లాక్ బాఉన్సనాల్ గ్రామానికి చెందిన జ్యోతిర్మయి కెఐఐటి (KIIT) యూనివర్సిటీ నుంచి బి.టెక్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె ఒక క్వాలిఫైడ్ మ్యూజిక్ థెరపిస్ట్. తన సంగీతంతో క్యాన్సర్ బాధితులకు, గర్భిణులకు ఉపశమనం కలిగించేలా పనిచేశారు. తన విజయానికి క్యాన్సర్ రోగుల ఆశీస్సులే కారణమని ఆమె చెప్పారు. "నేను వాళ్లకు పాటలు పాడి వినిపించినప్పుడు చాలా సంతోషించేవారు. నన్ను ఇండియన్ ఐడల్ లో చూడాలని ఆశపడ్డారు. వారి ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను" అని ఎమోషనల్ అయ్యారు. ఒడిషా నుంచి ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
అదరగొట్టిన ప్రదర్శనలు.. సెలబ్రిటీల ప్రశంసలు
గ్రాండ్ ఫినాలేలో అన్షికా చోంకర్, మన్రాజ్ వీర్ సింగ్, మైసమ్మే బోసు, సుహైల్ సూఫీ, తనిష్క్ శుక్లాతో పోటీపడి జ్యోతిర్మయి విజేతగా నిలిచారు. 'సయాన్ ఓ సయాన్' పాటకు ఆమె ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అందరినీ కట్టిపడేసింది. అంతకుముందు 'ఓ జబ్ తక్ హై జాన్' పాటకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని నుండి స్టాండింగ్ ఓవేషన్ లభించింది. అలాగే 'జానే క్యూ లోగ్ మొహబ్బత్ కియా కర్తే హై' పాట విని సీనియర్ నటి లీనా చందావర్కర్ భావోద్వేగానికి గురయ్యారు. ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పపోన్, కుమార్ సాను, షెహనాజ్ గిల్, ఊర్మిళా మటోండ్కర్ వంటి ప్రముఖులు ఫినాలే వేడుకలో సందడి చేశారు.
బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా మారడమే లక్ష్యం
సెప్టెంబర్ 14న ముంబైకి వచ్చిన జ్యోతిర్మయి, దాదాపు ఏడాది పాటు సాగిన తన జర్నీ గురించి మాట్లాడారు. "నేను కేవలం నా బెస్ట్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. ప్రైజ్ మనీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కాబట్టి ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు" అని తెలిపారు. తన తల్లిదండ్రుల సపోర్టు వల్లే ఈ స్థాయికి వచ్చానని, భవిష్యత్తులో బాలీవుడ్లో మంచి ప్లేబ్యాక్ సింగర్గా నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. జడ్జి శ్రేయా ఘోషాల్ స్పందిస్తూ, జ్యోతిర్మయి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, ఇది ఆమె సంగీత ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని శుభాకాంక్షలు తెలిపారు.

