నూతన సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి టాలీవుడ్ నిర్మాతలు.. సీఎం రేవంత్రెడ్డితో భేటీకి ప్లాన్..
తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన నిర్మాతలు, 24 క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఆయన కేబినేట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే తనకు ఎవరూ విషెస్ చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి ఆ మధ్య హాట్ కామెంట్ చేశారు. దిల్రాజు మాత్రమే విష్ చేశారని తెలిపారు. చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టబోతున్నట్టు చెప్పారు. సమగ్ర నివేదిక కావాలన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ని కలిశాడు టాలీవుడ్ నిర్మాతలు, 24 క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకి సంబంధించిన అనేక విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
మంత్రిని కలిసిన వారిలో దర్శక, నిర్మాత కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్రాజు, సురేష్బాబు, సీ కళ్యాణ్, దామోదర ప్రసాద్, రాందాస్, తుమ్మల సత్యనారాయణ, సుధాకర్రెడ్డి వంటి వారున్నారు. వీరితోపాటు ఇతర క్రాఫ్ట్ కి చెందిన టెక్నీషియన్లు కూడా మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, నిర్మాతలు ఫేస్ చేస్తున్న సమస్యలను, టికెట్ రేట్లు, సబ్సిడీలు ఇలా అనేక విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే టాలీవుడ్ పరిశ్రమ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 21న కలిసేందుకు అపాయింట్ మెంట్ లభించినట్టు తెలుస్తుంది.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసిన వారిలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, అసోసియేషన్ ఇతర సభ్యులు కూడా ఉన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను 24 శాఖలలో ఉన్న సినీ వర్కర్స్ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేసి పెడతాను. ఫిలిం ఇండస్ట్రీకి తప్పకుండా సపోర్టుగా నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సహకారంతో హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధిలో నడిపించండి` అని తెలిపారు.