ఇక తన జీవితాన్ని తాను జీవిస్తానంటోన్న మిల్కీ బ్యూటీ..
మిల్కీ బ్యూటీ తమన్నా కరోనాకి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజుకు అరవై వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీలను సైతం ఇది వెంటాడుతుంది.
అందులో భాగంగా తమన్నా భాటియాకి వైరస్ సోకింది. అయితే ముందుగా తమన్నా పేరెంట్స్ కి వైరస్ సోకింది. నెల రోజుల తర్వాత ఈ నెల మొదటి వారంలో తమన్నాకి సోకింది.
షూట్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో ఇక్కడే ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత మరికొన్ని రోజులపాటు స్వీయ నిర్భందంలో ఉన్న ఆమె, బుధవారం ఇంటికి వెళ్లారు.
తమన్నా ఇంటికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులు రజని, సంతోష్ భాటియా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. ఇక తమన్నా పెంపుడు కుక్క పెబెల్స్ సైతం ఆమెను చూడగానే సంతోషంతో గంతులు వేసింది.
ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఓ వీడియోని పంచుకుంది తమన్నా. ఇందులో తమన్నా చెబుతూ, కరోనా నుంచి కోలుకుని ఇంటికి రావడం క్రేజీగా అనిపించిందన్నారు.
ఇదంతా ముగిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు తన జీవితం తాను జీవించవచ్చని పేర్కొంది. త్వరలోనే అన్ని విషయాలను మీతో పంచుకుంటానని చెప్పింది.
మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటానని, కరోనా కారణంగా కోల్పోయిన శక్తినంతటినీ తిరిగి పొందేందుకు, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటానని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ చిత్ర షూటింగ్లకు వెళ్తానని పేర్కొంది.
దాదాపు మూడు నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోపై తమన్నా బెస్ట్ఫ్రెండ్, నటి శృతి హాసన్ స్పందించారు. ఇదంతా చూస్తుంటే తనకెంతో సంతోషం కలుగుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో స్పెషల్ సాంగ్లో మెరిసిన తమన్నా ప్రస్తుతం `బోల్ చుడియన్`, `సీటీమార్` చిత్రాల్లో నటిస్తుంది.
దీంతోపాటు నితిన్ హీరోగా రూపొందే బాలీవుడ్ చిత్రం `అంధాధున్` రీమేక్లో నటించబోతుంది. ఇందులో ఆమె నెగటివ్ రోల్ పోషించనుంది.