రజనీ అందుకు భయపడుతున్నాడా?.. బట్ బర్త్ డేకి డబుల్ ట్రీట్ ఇస్తాడా?
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు విషయాల్లో మాత్రం భయపడుతున్నాడట. అడుగు ముందుకేయాలంటే పది సార్లు ఆలోచిస్తున్నాడట. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ ఇటీవల రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రం షూటింగ్లకు, ఇటీవల థియేటర్లకి అనుమతి ఇచ్చింది. కానీ ఇంకా రజనీ ఆలోచిస్తున్నాడు.
`అన్నాత్తే` చిత్రాన్ని తిరిగి ప్రారంభించేందుకు భయపడుతున్నాడు. కరోనా విజృంభన తగ్గకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇటీవలే హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించాలని, అందుకు రజనీ వచ్చేందుకు రెడీ అయ్యారు. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
`అన్నాత్తే`లో రజనీతోపాటు నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తిసురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నప్పుడే లాక్డౌన్ వచ్చింది. షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ పరిస్థితులలో వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో ఈ నెల 10న రజనీ ఈసినిమా షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వినిపించాయి. ఆ షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెల ఎనిమిదిన చెన్నై నుంచి హైదరాబాద్కు కారులో వెళ్లడానికి తగు ఏర్పాట్లు కూడా జరిగాయి. ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ కూడా బుక్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రజనీ అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేక పోయింది. కానీ దానికి బ్రేక్ పడింది.
మరో విషయంలో కూడా రజనీ ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాడట. అదే రాజకీయ పార్టీ. ఆయన ఆ మధ్య రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అధికారికంగానూ ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ఏడాది పార్టీని ప్రారంభిస్తారని ముందుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారట.
ముందు ప్లాన్ ప్రకారం అక్టోబర్లో సినిమా షూటింగ్ని ప్రారంభించి, నవంబర్లో పూర్తి చేసి, డిసెంబర్లో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని రజనీ అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నేతలంతా సంతోషించారు. అయితే ఊహించని విధంగా పార్టీని ప్రారంభించే విషయంగా రజనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయమై రజనీ మక్కల్ మండ్రం నేతలు మాట్లాడుతూ సినిమా షూటింగ్లకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుమతించి నెల రోజులుదాటినా పెద్ద సినిమాల షూటింగ్లేవీ ప్రారంభం కాలేదన్నారు.
తమిళనాడులో మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఇతర పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. సభలు, సమావేశాలకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ మాత్రం ఇంకా ఆలోచిస్తున్నారట.
తమిళనాట ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నా యంగా ఆధ్యాత్మిక రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతు న్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసి తీరుతానని ప్రకటించిన రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని ప్రారంభించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చిన రాజకీయ ప్రవేశంపై నవంబర్ లేదా డిసెంబర్లో రజనీ ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే పార్టీని ప్రారంభించాలని రజనీ నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రజనీ మళ్ళీ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని తెలియగానే సన్నిహితులు, స్నేహితులు ఆయనను కలుసుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల షూటింగ్లకు అనుమతి లభించినా పెద్ద సంస్థలకు చెందిన షూటింగ్లేవీ జరగడం లేదని, కమల్హాసన్ కూడా కరోనా నిరోధక నిబంధనల నడుమ బిగ్బాస్ షోలో పాల్గొంటున్నారే తప్ప షూటింగ్కు వెళ్ళలేదని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు షూటింగ్లో పాల్గొనేందుకు తొందరపడవద్దని రజనీకి వారంతా సూచించారు.
కరోనా పూర్తిగా కట్టడిలోకి వచ్చిన తర్వాత, ఆ వైరస్ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన తరువాతే షూటింగ్లో పాల్గొనమని సలహా ఇచ్చారు. రజనీ సన్నిహితులు అంతటితో ఆగలేదు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు హైదరాబాద్లో జరిగిన టీవీ షో షూటింగ్లో పాల్గొనటం వల్లే ఆయనకు కరోనా సోకిందన్న విషయాన్ని మరువకూడదని తెలిపారు. సన్నిహితుల సలహాలు విన్న రజనీ షూటింగ్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని సినీ నిర్మాణ సంస్థ నిర్వాహకులకు తెలిపారు. నిర్మాతల కూడా రజనీపై ఒత్తిడి చేయడానికి సాహసించలేకపోయారు. రజనీ అనుమతించిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ అంశాలను పరిశీలించినట్లయితే రజనీ డిసెంబర్ వరకు షూటింగ్లకు హాజరుకారని స్పష్టమవుతోంది. వచ్చే యేడాది జనవరిలోనూ రజనీ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజుల్లో `అన్నాత్తే` షూటింగ్ ముగిసిన తర్వాతే ఫిబ్రవరిలోనే రజనీ రాజకీయ అరంగేట్రం చేస్తారని, పార్టీ పేరును ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు.
డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆ సమయంలోనే రాజకీయ పార్టీని ప్రారంభించే విషయమై ఆయన కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం గురించి, సీఎం అభ్యర్థి ఎంపిక గురించి రజనీ ఆ రోజునే అధికారికంగా ప్రకటిస్తారని, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అభిమానులను, మండ్రం నేతలను నిరాశకు గురిచేయరని తెలిపారు. అదే సమయంలో తాను నటిస్తున్న `అన్నాత్తే` చిత్రానికి చెందిన ట్రీట్ని ఇవ్వబోతున్నారట. మొత్తానికి బర్త్ డేకి డబుల్ ట్రీట్ని రెడీ చేస్తున్నారు రజనీ.