Padma Awardsపై మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ కామెంట్.. చిరంజీవి సత్కారం
Padma Awards: సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్లకు పద్మ అవార్డులు వరించిన నేపథ్యంలో వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. వారిని చిరంజీవి సత్కరించారు.

పద్మ అవార్డులపై రాజేందప్రసాద్, మురళీ మోహన్ స్పందన
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నుంచి సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ కి, మురళీ మోహన్లకు పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. గత యాభై ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలందించిన వీరిని కేంద్ర ప్రభుత్వం చాలా లేట్గా గుర్తించింది. లేట్ అయినా తమకు హ్యాపీ అని, వెయిట్ చేశాక వచ్చే ఫలితం చాలా సంతోషాన్నిస్తుందని, వాటికి విలువ ఎక్కువ అని అంటున్నారు పద్మ అవార్డు విజేతలు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మరోవైపు వీరిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించడం విశేషం.
లేట్ అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది-మురళీ మోహన్
పద్మశ్రీ పురస్కారం రావడంపై సీనియర్ నటుడు, వ్యాపారవేత్త మురళీ మోహన్ స్పందిస్తూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పద్మ అవార్డు ఇప్పుడు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చిందని అంటున్నారు. లేట్ ఏం కాదు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. చెట్టుకి పండుని అందినప్పుడే కోసుకుంటే దాని అందం అప్పటితోనే పోతుంది. దొరకలేదు దొరకలేదు అని ఎదురుచూసిన తర్వాత దొరికితే దానికి విలువ ఎక్కువ. ఇది కూడా నేను అలానే ఫీలవుతున్నా. అవార్డు వచ్చిన మిత్రులందరికి శుభాకాంక్షలు. ఈ అవార్డు రావడానికి కారణమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే చిత్ర పరిశ్రమలో సహకరించిన అందరికి, మీడియా వారికి ధన్యవాదాలు` అని తెలిపారు మురళీ మోహన్.
రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ కామెంట్
మరో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తాను. కళను గౌరవించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు. అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం ఆడియెన్స్. 48ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈ రోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, నటకిరీటిని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. నన్ను ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా` అని చెప్పారు రాజేందప్రసాద్.
రాజేంద్రప్రసాద్కి చిరంజీవి సత్కారం
పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన రాజేందప్రసాద్, మురళీ మోహన్లను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురస్కారాలు తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టి, మాధవన్తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్డ్కప్ విజేత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరి కి అభినందనలు తెలియజేశారు.
మురళీ మోహన్కి చిరు సత్కారం
`విశిష్ట వ్యక్తులను సత్కరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ ధర్మజీ గారి పద్మ విభూషణ్, మై డియర్ మమ్ముట్టీ గారు, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి లభించిన పద్మ భూషణ్.. ఇవన్నీ దశాబ్దాల పాటు వారు చూపిన అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవం. మిత్రులు మురళీ మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సోదరుడు మాధవన్ గారు, మన చాంపియన్ రోహిత్ శర్మ, అలాగే వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలకు నా హృదయపూర్వక అభినందనలు` అని తెలిపారు చిరు.

