మహేష్-నమ్రత అలా ప్రేమలో పడ్డారు..!
మహేష్-నమ్రతలను టాలీవుడ్ బెస్ట్ కపుల్ అని చెప్పుకోవచ్చు. 15ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు మాత్రం 20 ఏళ్ళు. వంశీ మూవీ మహేష్-నమ్రతలను కలిపింది.
టాలీవుడ్ లో అమ్మాయిల కలల రాకుమారుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఈ హ్యాండ్ సమ్ హీరో లేడీ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి చిరునామాగా, ఊతపదంగా మహేష్ పేరును వాడేస్తూ ఉంటారు.
అలాంటి మహేష్ మనసు గెలిచింది హీరోయిన్ నమ్రతా శిరోద్కర్. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ అందుకున్న ఈ సుందరి మహేష్ కి తొలిచూపులోనే నచ్చేసిందట.
మహేష్ నమ్రత కలిసి నటించింది కేవలం ఒక సినిమాలోనే. ప్రేమలో పడడానికి ఒక్క క్షణం చాలు అన్నట్లు... అలాగే వంశీ మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.
రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ తన మూడవ చిత్రంగా వంశీ చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ వంశీ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందట. అది షూటింగ్ చివరి రోజు వరకు చెప్పుకోలేదట. ఒక షూటింగ్ ముగిసింది ఎవరి దారివారిది అనుకుంటున్న సమయంలో మహేష్ తన ప్రేమను నమ్రతతో తెలియజేశారట.
అప్పటికే మనసులో మహేష్ ని ఆరాధిస్తున్న నమ్రత వెంటనే ఒకే చెప్పేశారట. అప్పుడు లవర్స్ గా మారిన వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఐదేళ్లు ప్రేమించుకున్నారు. 2005లో వీరు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.
మహేష్-నమ్రతల ప్రేమకు నాంది పలికిన వంశీ మూవీ విడుదలై నేటి 20 సంవత్సరాలు. 2000 అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.