అసెంబ్లీలో `తలైవి`.. జయలలితగా కంగనా లుక్స్ అదుర్స్.. ఫోటోస్ హల్చల్
కంగనా రనౌత్.. జయలలితగా నటిస్తున్న `తలైవి` చిత్రం కరోనా తర్వాత ప్రారంభమై ఓ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. తాజాగా కంగనా ఈ విషయాన్ని చెబుతూ పలు ఆసక్తికర ఫోటోలను పంచుకుంది.
అలనాటి మేటి నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో `తలైవి`గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తుంది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా కరోనా ఆగిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేశాక, కేంద్రం షూటింగ్లకు అనుమతి ఇచ్చాక ఇటీవల షూటింగ్ ప్రారంభించారు. శరవేగంగా చిత్రీకరణ జరిపి ఓ షెడ్యూల్ని పూర్తి చేశారు. ఈ విషయాన్ని చెబుతూ, కంగనా షూటింగ్కి సంబంధించిన ఫోటోలను, తన మేకోవర్ లుక్స్ ని పంచుకుంది.
ఇందులో జయలలితగా ఆమె మారిన వైనం, అసెంబ్లీ సమావేశంలో హాల్లోకి వస్తున్న ఫోటో, అసెంబ్లీలో కూర్చొన్న ఫోటోలను పంచుకుంది.
ఈ సందర్భంగా కంగనా స్పందిస్తూ, `జయ మా ఆశీస్సులతో `తలైవి` మరో షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత చాలా విషయాలు భిన్నంగా ఉన్నాయి. కానీ యాక్షన్, కట్ చెప్పే విధానం ఏం మారలేదు` అని పేర్కొంది.
మరోవైపు కంగనాకి దర్శకుడు ఏ.ఎల్ విజయ్ సీన్ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. ఇవి సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఏ.ఎల్ విజయ్ అద్భుతమైన దర్శకుడని ఈ సందర్భంగా కంగనా తెలిపింది.