- Home
- Sports
- Cricket
- Virat Kohli's 100th Test: విరాట్ కోహ్లి వందో టెస్టు కోసం.. మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చబోతున్న బీసీసీఐ
Virat Kohli's 100th Test: విరాట్ కోహ్లి వందో టెస్టు కోసం.. మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చబోతున్న బీసీసీఐ
కోహ్లి పుట్టి పెరిగింది ఢిల్లీ అయినా బెంగళూరు తో అతడికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, అతడికి విడదీయలేని అనుబంధం...

వెస్టిండీస్ తో వన్డేలు, టీ20 సిరీస్ ముగిశాక భారత జట్టు శ్రీలంకతో ఢీకొనబోతున్నది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగించుకుని నేరుగా భారత్ కు చేరుకునే శ్రీలంక.. ఇక్కడ భారత్ తో మూడు టీ20 లు, రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది.
బెంగళూరు, మొహాలీ వేదికగా రెండు టెస్టులను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. ఇదిలాఉండగా.. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరుగబోయే టెస్టు.. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి వందో టెస్టు కానుంది.
ఈ టెస్టును అతడి కెరీర్ లో మరింత చిరస్మరణీయంగా చేయాలని బీసీసీఐ యోచిస్తున్నది. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి ఆడబోయే మ్యాచును.. గులాబీ టెస్టు (డే అండ్ నైట్ టెస్ట్) గా మార్చాలని భావిస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ’గతంలో టీ 20లను మొహాలి, ధర్మశాల, లక్నోలలో నిర్వహించాలనుకున్నాం. కానీ దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిరీస్ ను రెండు లేదా మూడు వేదికల్లోనే నిర్వహించాలనుకుంటున్నాం
లక్నో లో టీ 20 జరుగకపోవచ్చు. బెంగళూరు టెస్టును పింక్ బాల్ టెస్టుగా నిర్వహించాలనుకుంటున్నాం. మొహాలి టెస్టును కూడా డే అండ్ నైట్ టెస్టుగా ఆడాలనుకున్నా అక్కడ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాం. దీనిపై బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది...’ అని తెలిపాడు.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకునే శ్రీలంక జట్టు ముందు టెస్టులు ఆడాలి. ఫిబ్రవరి 25 నుంచి టెస్టు సిరీస్ మొదలవ్వాల్సి ఉంది. కానీ ముందు టీ20 లు ఆడించి ఆ పై టెస్టు సిరీస్ నిర్వహించాలని శ్రీలంక బీసీసీఐ ని కోరింది. తద్వారా తాము బయో బబుల్ ను ఈజీగా నిర్వహించుకునేందుకు వెసులుబాటు దొరుకుతుందని విన్నవించింది.
అయితే దీనిమీద బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ శ్రీలంక బోర్డు వినతిని మన్నించినట్టు తెలుస్తున్నది. భారత్ కూడా అప్పటికి వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ముగించుకుని ఉంటుంది కాబట్టి ఆటగాళ్లను కూడా మార్చకుండా అదే ఫ్లో లో ఆడించే అవకాశం ఉంటుంది. అలా కాక టెస్టు సిరీస్ ముందు నిర్వహిస్తే.. మళ్లీ జట్టును మార్చడం, బయో బబుల్ సమస్యలు తలెత్తే ఛాన్సుండటంతో బీసీసీఐ కూడా శ్రీలంక ప్రతిపాదనకు ఓకే చెప్పనున్నట్టు తెలుస్తున్నది.
భారత్ గతంలో రెండు పింక్ బాల్ టెస్టులు ఆడింది. అవి ఒకటి బంగ్లాదేశ్ పై కోల్కతా (ఈడెన్ గార్డెన్) లో.. రెండోది ఇంగ్లాండ్ పై అహ్మదాబాద్ లో.. 2019లో బంగ్లాదేశ్ పై ఈడెన్ గార్డెన్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి మళ్లీ శతకం రాలేదు.