Rishabh Pant : కెప్టెన్సీకి పంత్ గుడ్బై.. LSG కొత్త సారథి ఎవరు?
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే కాస్ట్లీ ప్లేయర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. మరి ఈ టీం కొత్త కెప్టెన్ ఎవరు? ఎవరికి అవకాశాలున్నాయి?

లక్నో కెప్టెన్సీకి రిషబ్ రిజైన్..
ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.
పంత్ రాజీనామాపై లక్నో కామెంట్స్
రిషబ్ పంత్ రాజీనామా అభ్యర్థనను లక్నో యాజమాన్యం అధికారికంగా ఆమోదించింది. ఈ విషయాన్ని లక్నో టీమ్ తమ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ధృవీకరించింది. అంతేకాదు దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
లక్నో టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ మాట్లాడుతూ.. 'కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి రిషబ్ పంత్ స్వయంగా ముందుకొచ్చాడు. మేం అతని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. కెప్టెన్గా లక్నో డ్రెస్సింగ్ రూమ్కు అతను తీసుకొచ్చిన ఎనర్జీకి, అందించిన సేవలకు ధన్యవాదాలు. ఇకపై జట్టును పునర్నిర్మించడంపై మా దృష్టి ఉంటుంది' అని చెప్పారు.
లక్నోతో రిషబ్ జర్నీ..
ఢిల్లీ క్యాపిటల్స్తో ఎనిమిది సీజన్లు ఆడిన తర్వాత రిషబ్ పంత్ లక్నో జట్టులోకి వచ్చాడు. 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది… కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ కెప్టెన్గా, బ్యాటర్గా పంత్ లక్నో తరఫున పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో ఒక సెంచరీ (118) చేసినప్పటికీ మొత్తం మీద 269 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ గా కూడా రాణించలేదు… దీంతో జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈసారి 13 ఇన్నింగ్స్ల్లో 312 పరుగులతో పరవాలేదనిపించినా జట్టును విజయపథంలో నడిపించడంలో పంత్ మరోసారి విఫలమయ్యాడు. 14 మ్యాచ్ల్లో 10 ఓటములతో జట్టు చివరి స్థానానికి పడిపోయింది. దీనికి ముందు తొలి మూడు సీజన్లలో కేఎల్ రాహుల్ నాయకత్వంలో లక్నో జట్టు రెండుసార్లు ప్లే-ఆఫ్స్కు చేరిన విషయం తెలిసిందే. కానీ జట్టును బలోపేతం చేసేందుకు భారీ మొత్తానికి కొనుగోలు చేసిన పంత్పై పెట్టిన పెట్టుబడి, రెండేళ్లలో ఘోరంగా విఫలమైంది.
LSG కొత్త కెప్టెన్ ఎవరు?
రిషబ్ పంత్ రాజీనామాతో కొత్త కెప్టెన్ను ఎంచుకోవడం లక్నో జట్టుకు పెద్ద సవాలుగా మారింది. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగల ముగ్గురు అనుభవజ్ఞులైన విదేశీ ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అతను సౌతాఫ్రికా టీ20 లీగ్లో లక్నో అనుబంధ జట్టు అయిన డర్బన్ సూపర్ జెయింట్స్కు, 'ది హండ్రెడ్' సిరీస్లో మాంచెస్టర్ ఒరిజినల్స్కు నాయకత్వం వహిస్తున్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా లక్నో పరిశీలనలో ఉన్న మరో ఆటగాడు. ఈ సీజన్లో ఫామ్లో లేనప్పటికీ నికోలస్ పూరన్ను కూడా కెప్టెన్సీకి పరిశీలించే అవకాశం ఉంది. గతేడాది మేజర్ లీగ్ క్రికెట్లో పూరన్ ఎంఐ న్యూయార్క్కు టైటిల్ అందించాడు. వచ్చే సీజన్లో రిషబ్ పంత్ జట్టులో కొనసాగుతాడా? లేదా మెగా వేలానికి వెళ్తాడా? అనేది వేచి చూడాలి.

