Preity Zinta: ఇండియన్ ఆర్మీకి అండగా ప్రీతీ జింటా.. భారీ విరాళం
Preity Zinta: ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అమరవీరులైన సైనికుల భార్యలు, పిల్లలకు భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ XI సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందజేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారత సైనిక కుటుంబాలకు ప్రీతి జింటా భారీ విరాళం
బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా, తన మంచి పనులతో అందరి మనసులను గెలుచుకుంటూనే ఉన్నారు. దేశం కోసం మంచి చేయడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు. ఈసారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల భార్యలు, పిల్లలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అమరులైన సైనికుల కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించారు. రూ.1.10 కోట్లు అమరులైన సైనిక కుటుంబాలకు అందించారు. సైనికుల ఋణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆమె అన్నారు.
అమరులైన సైనికుల భార్యలకు అండగా ప్రీతి జింటా
మీడియా కథనాల ప్రకారం, ప్రీతి జింటా అమరులైన సైనికుల భార్యలు, వారి పిల్లలకు సుమారు రూ.1.10 కోట్లు దానం చేశారు. ఈ మొత్తాన్ని తన జట్టు పంజాబ్ కింగ్స్ CSR (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యక్రమంలో భాగంగా సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ విడోస్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) కి అందజేశారు. ఈ డబ్బును వారు పూర్తిగా వారి జీవనం, పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవచ్చని ఆమె తెలిపారు.
సైనికుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేము
'మా సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు సహాయం చేయడం గౌరవం, బాధ్యత. మన సైనికులు చేసే త్యాగానికి ఎప్పటికీ ప్రతిఫలం ఉండదు. కానీ, వారి కుటుంబాలకు అండగా నిలబడి ముందుకు రావడానికి సహాయం చేయవచ్చు. మా సాయుధ దళాల గురించి మాకు గర్వంగా ఉంది. మా దేశం, దాని ధైర్యవంతులైన రక్షకులతో మేము నిలబడుతున్నాము' అని ప్రీతి జింటా అన్నారు.
నేను ఫౌజీ కూతురు - ప్రీతి జింటా
పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు ప్రీతి జింటా సైన్యంతో గర్వపడుతున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో తాను ఫౌజీ కూతురు అని చెప్పుకున్నారు. 'కొన్నిసార్లు ఫౌజీ కుటుంబాలు సైనికుల కంటే బలవంతులు అని నాకు అనిపిస్తుంది.
దేశం కోసం కొడుకును త్యాగం చేసే తల్లులను చూశాను. భర్తను మళ్ళీ చూడలేని భార్యలను చూశాను. తండ్రి లేదా తల్లి మార్గదర్శకత్వం లేకుండా పెరిగే పిల్లలను చూశాను. ఇది వాస్తవం.. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఇది ఎప్పటికీ మారదు. కాబట్టి దేవుడు వారిపై దయ చూపాలి' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
లాహోర్ 1947 మూవీలో ప్రీతి జింటా
ప్రీతి జింటా 'లాహోర్ 1947' చిత్రంలో కనిపించనున్నారు. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ నటిస్తున్నారు. చిత్ర విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.