Mohammed Shami: ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్టు జట్టులో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి చోటుదక్కలేదు. ఈ నిర్ణయం వెనుక కారణాలను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాకు వివరించారు.
Mohammed Shami: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు భారత జట్టును ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ జట్టు కూర్పునకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. అలాగే, పలువురు స్టార్ ప్లేయర్లకు జట్టులో చోటు కల్పించకపోవడానికి గల కారణాలను కూడా ప్రస్తావించారు. రాబోయే టెస్ట్ సిరీస్కు కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని భారత జట్టు నుండి ఎందుకు తొలగించారో అగార్కర్ వెల్లడించాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ కావడంతో భారత టెస్టు జట్టుకు శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. కుడిచేతి వాటం సీమర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు బౌలింగ్ యూనిట్కు నాయకత్వం వహిస్తాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ జట్టులోని ఇతర ఫాస్ట్ బౌలర్లు.
షమీని భారత టెస్ట్ జట్టు నుండి ఎందుకు తొలగించారు?
షమీని తొలగించడంపై అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. "వైద్య సంబంధ విషయాలతోనే అతను ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతనికి కొంత సమయం విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు చెప్పారు. అతను ఈ సిరీస్కు ఫిట్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ గత వారంలో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. షమీ ఐదు టెస్టులు ఆడగలడని నేను అనుకోను. అతను కనీసం సిరీస్లోని కొంత భాగం అందుబాటులో ఉంటాడని మేము ఆశించాము, కానీ అది కుదరలేదు. ఇది జట్టుకు పెద్ద దెబ్బ అని తెలిపాడు.
కాగా, చీలమండ గాయం కారణంగా షమీ ఒక సంవత్సరం పాటు ఆన్-ఫీల్డ్ యాక్షన్కు దూరంగా ఉన్నాడు. షమీ 2024 ఫిబ్రవరిలో చీలమండ శస్త్రచికిత్స నుండి విజయవంతంగా కోలుకున్నాడు, కానీ అతని కుడి మోకాలిలో నొప్పి మొదలైంది, దాని కోసం అతను చికిత్స పొందుతున్నాడు. గతేడాది దేశవాళీ క్రికెట్ లో అడుగుపెట్టి బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఆడాడు. రీఎంట్రీలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో షమీ జట్టులోకి తిరిగి వస్తాడని అందరూ అనుకున్నారు.
ఒక సంవత్సరం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి షమీ
34 ఏళ్ల ఈ బౌలర్కు 2025లో అన్ని ఫార్మాట్లలో భారత్ తరపున కొత్త బంతితో బౌలింగ్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో టైటిల్ గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారంలో అతను దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఉమ్మడిగా రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. షమీ 64 టెస్టుల్లో భారత్ తరపున ఆడి 27.1 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు, ఆరు సార్లు ఐదు వికెట్లు సాధించాడు.
ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత షెడ్యూల్
2025-2027 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు 2025లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ సిరీస్ 2025 జూన్ నుండి ఆగస్టు వరకు జరుగుతుంది. హెడింగ్లీ (లీడ్స్), ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), లార్డ్స్ (లండన్), ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్), ది ఓవల్ (లండన్) వేదికలుగా మ్యాచ్లు జరుగుతాయి.
ఈ నెల ప్రారంభంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ ఆడనున్న మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇది.
ఇంగ్లాండ్ సిరీస్కు భారత టెస్ట్ జట్టు ఇదే
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.