- Home
- Sports
- Cricket
- Digvesh Rathi: ఐపీఎల్ స్టార్ దిగ్వేష్ రాథీ మరో సంచలనం.. వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు
Digvesh Rathi: ఐపీఎల్ స్టార్ దిగ్వేష్ రాథీ మరో సంచలనం.. వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు
Digvesh Rathi: ఐపీఎల్ అరంగేట్రం సీజన్ లోనే సంచలనాలకు తెరలేపిన దిగ్వేష్ రాథీ స్థానిక టీ20లో 5 బంతుల్లో 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ 2025లోనూ మెరిసిన రాథీపై ఎల్ఎస్జీ ఓనర్ గోయెంకా ప్రశంసలు కురిపించారు.

స్థానిక టీ20లో దిగ్వేష్ రాథీ అరుదైన ఘనత
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున తొలి సీజన్నే దుమ్ములేపిన మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాథీ తాజాగా మరోసారి తన టాలెంట్ను ప్రపంచానికి చూపించాడు. ఓ స్థానిక టీ20 మ్యాచ్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. దీనిపై ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కూడా స్పందిస్తూ రాథీ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.
వైరల్ వీడియోలో దిగ్వేష్ రాథీ స్పిన్ మాయాజాలం
ఈ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును పూర్తిగా ఒత్తిడిలో ఉన్న సమయంలో దిగ్వేష్ రాథీ వారికి చుక్కలు చూపించాడు. రాథీ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. వరుసగా 5 బంతుల్లో నలుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశారు. అలాగే, ఒకరిని ఎల్బీడబ్ల్యూ చేసి వరుసగా ఐదు బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. మొత్తం ఈ మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు. తన ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఈ ఘనత సాధించాడు.
ఈ వీడియోను షేర్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. "దిగ్వేష్ రాథీ. 5 స్టార్ పనితీరు" అంటూ పేర్కొంది. అలాగే, ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా తన X (ట్విట్టర్) ఖాతాలో, "ఒక చిన్న క్లిప్ చూసాను. స్థానిక టీ20 మ్యాచ్లో దిగ్వేష్ 5 వికెట్లు వరుసగా తీస్తూ మాకు బ్రేక్ఔట్ స్టార్గా మారిన ప్రతిభను చూపించాడు" అని ప్రశంసించారు.
Digvesh Rathi. 5 stars 🌟 🌟🌟🌟🌟pic.twitter.com/tF4Nw0Gj0Q
— Lucknow Super Giants (@LucknowIPL) June 16, 2025
ఐపీఎల్ 2025లో దిగ్వేష్ రాథీ
దిగ్వేష్ రాథీని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మొదటి సీజన్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు తీసిన దిగ్వేష్ సింగ్ రాథీ, 8.25 ఎకానమీతో టీమ్కు కీలక బౌలర్గా నిలిచాడు. అతడి తొలి ఐపీఎల్ వికెట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ కాగా, అదే మ్యాచ్లో విప్రజ్ నిగమ్ను కూడా ఔట్ చేశాడు.
ఐపీఎల్ లో నోట్ బుక్ సెలబ్రేషన్ తో వివాదం రేపిన దిగ్వేష్ రాథీ
ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో పాటు వికెట్లు తీసిన తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్ తో రాథీ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి 'నోట్బుక్ సెలబ్రేషన్' కూడా భారీ చర్చలకు దారి తీసింది. వికెట్ తీసిన వెంటనే బ్యాట్స్మెన్ పేరును రచిస్తున్నట్లు హావభావాలు ఇచ్చే సెలబ్రేషన్ను దిగ్వేష్ రాథీ అనుసరించడంతో బీసీసీఐ పలు మార్లు హెచ్చరించింది. మళ్లీ అదే తరహా ప్రవర్తన రిపీట్ కావడంతో బీసీసీఐ పలు మ్యాచ్ల్లో జరిమానాలు విధించింది.
ఐపీఎల్లో ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్న దిగ్వేష్ రాథీ
తన నోట్ బుక్ సెలబ్రేషన్స్ తో వివాదం రేపిన దిగ్వేష్ రాథీ ఐపీఎల్ 2025 సీజన్లో మొత్తం 5 డీమెరిట్ పాయింట్లు అందుకోవడంతో మే 22, 2025న గుజరాత్ టైటాన్స్పై మ్యాచ్కు ముందు దిగ్వేష్ రాథీ నిషేధం ఎదుర్కొన్నాడు.
ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 1 డీమెరిట్ పాయింట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 4న ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 2 పాయింట్లు అందుకున్నాడు. మేలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో వాగ్వాదం జరిగిన అనంతరం మరో 2 పాయింట్లు చేరాయి. దీంతో మొత్తం 5 డీమెరిట్ పాయింట్లు కావడంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
దిగ్వేష్ సింగ్ రాథీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి?
దిగ్వేష్ రాథీ ఢిల్లీకి చెందిన ప్లేయర్. దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. అతడు క్లబ్ స్థాయిలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, కేకేఆర్ నెట్ బౌలర్గా సేవలందించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 10 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి గుర్తింపు సాధించాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీయడంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.