Ind vs Eng: ఇంగ్లాండ్ లో డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు ఎవరు?
India vs England: ఇంగ్లాండ్లో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో తాజాగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా చేరారు. 269 పరుగులు డబుల్ సెంచరీ నాక్ తో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించింది.

శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు
ఇంగ్లాండ్లో భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన ఘనత సాధించారు. టెస్ట్ క్రికెట్లో SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియాన్ కెప్టెన్గా నిలిచారు. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు 269 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో గిల్ ఈ ఘనత సాధించాడు.
అయితే, ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు ఎవరో మీకు తెలుసా?
శుభ్మన్ గిల్: ఎడ్జ్బాస్టన్లో 269 పరుగులు
భారత జట్టు యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తాజా ఇన్నింగ్స్ ద్వారా కొత్త చరిత్ర లిఖించుకున్నారు. భారత జట్టు మొదటి రోజు 211/5 స్కోరుతో కష్టాల్లో ఉన్న సమయంలో, గిల్ తన సుదీర్ఘ ఇన్నింగ్స్ ప్రారంభించి సెంచరీ పూర్తి చేశాడు.
రెండో రోజు దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. మొత్తంగా తన ఇన్నింగ్స్ లో 387 బంతులను ఆడి 269 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 587/10 పరుగులు చేసింది.
గిల్కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87 పరుగులు), రవీంద్ర జడేజా (89 పరుగులు) బాగా సహకరించారు. గిల్ చేసిన ఈ ఇన్నింగ్స్ ద్వారా ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లో 250 పరుగుల మార్క్ను దాటిన తొలి భారత బ్యాటర్గా గుర్తింపు పొందారు. ఇది ఒక ఆసియాన్ కెప్టెన్గా సేన దేశాల్లో తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం.
సునీల్ గవాస్కర్: ది ఓవల్లో 221 పరుగుల నాక్
1979లో ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ 221 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇంగ్లాండ్ గడ్డపై భారత బ్యాటర్లలో టాప్ స్కోర్ చేసిన బ్యాటర్ గా చాలా కాలం నుంచి టాప్ లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 438 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. భారత్ విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత్ చివరి రోజున 429/8 వద్ద నిలిచింది. గవాస్కర్ 443 బంతుల్లో 221 పరుగులు చేయగా, అతనికి చెతన్ చౌహాన్ (80 పరుగులు), దిలీప్ వెంగ్సర్కార్ (52 పరుగులు) తోడుగా నిలిచారు. ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.
గవాస్కర్ ఇన్నింగ్స్కు టెస్ట్ క్రికెట్ చరిత్రలో విశేష స్థానం లభించింది. ఇది నాల్గో ఇన్నింగ్స్లో వచ్చిన టెస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం.
రాహుల్ ద్రావిడ్: ది ఓవల్లో 217 పరుగులు ఇన్నింగ్స్
భారత జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 2002లో ది ఓవల్ వేదికగా 217 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ద్రావిడ్, రెండో ఇన్నింగ్స్లో 468 బంతుల్లో తన డబుల్ సెంచరీ స్కోరు చేశారు.
ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 515/10 స్కోరు చేయగా, మైకేల్ వాన్ 195 పరుగులు చేశాడు. భారత్ తరఫున ద్రావిడ్ అద్భుతమైన నాక్ ఆడాడు. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ద్రావిడ్ ఇన్నింగ్స్ భారత జట్టును నిలబెట్టిన కీలక ఘట్టంగా నిలిచింది. ఇది కూడా ఇంగ్లాండ్ గడ్డపై భారత బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు లలో ఓకటిగా నిలిచింది.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ ఆధిపత్యం
ఇంగ్లాండ్లో టెస్ట్ క్రికెట్ను ఎదుర్కొనడం భారత బ్యాటర్లకు ఎప్పుడూ సవాలుగా ఉంటుంది. ఆ తరహా పరిస్థితుల్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు (శుభ్మన్ గిల్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్) సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడటం గర్వించదగిన విషయంగా చెప్పవచ్చు.
కాగా, ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ 587 పరుగులు చేసింది. కెప్టెన్ గా గిల్ తన తొలి టెస్టు డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు.
ఆ తర్వాత భారత బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్ 56* పరుగులు, జేమీ స్మిత్ 49* పరుగులతో ఆడుతున్నారు.