IND vs ENG: 669 పరుగులు చేసినా భారత్ పై గెలవలేకపోయిన ఇంగ్లాండ్
India vs England: ఇంగ్లాండ్ 669 పరుగులు చేసినా భారత్ పై గెలవలేకోయింది. రవీంద్ర జడేజా- వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చారు.

ఇంగ్లాండ్ ఊహించివుండదు.. 669 పరుగుల రికార్డు కూడా పని చేయలేదు
ఇంగ్లాండ్ జట్టు 669 పరుగుల భారీ స్కోరు చేసినా, నాల్గవ టెస్ట్ను గెలవలేకపోయింది. మాంచెస్టర్ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు భారత వికెట్లు తీయడం కోసం బలం మొత్తం ఉపయోగించి శ్రమించినా ఫలితం లేకపోయింది.
భారత ఆటగాళ్ల పట్టుదల ముందు ఇంగ్లాండ్ విఫలమైంది. మొదటి ఇన్నింగ్స్లో తడబడిన భారత్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీల మొత మోగించింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ సెంచరీలతో ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు.
KNOW
భారత్ మొదటి ఇన్నింగ్స్లో ఒడిదుడుకులు
ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా 4వ టెస్టు మాంచెస్టర్ లో జరిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ (54), కేఎల్ రాహుల్ (46), రిషభ్ పంత్ (54), సాయి సుదర్శన్ (61), శార్దూల్ ఠాకూర్ (41) భారత్ స్కోరు బోర్డును నిలబెట్టారు. కానీ, పెద్ద స్కోర్ ను అందించలేకపోయారు.
ఇంగ్లాండ్ భారీ స్కోరు... కానీ గెలుపు దక్కలేదు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో విజృంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (94 పరుగులు), జాక్ క్రాలీ (84 పరుగులు) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఒలీ పోప్ (71 పరుగులు), జో రూట్ (150 పరుగులు) ఆ తరువాత జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయడంతో పాటు 141 పరుగులు కూడా చేశాడు. మొత్తంగా 669 పరుగులు చేసిన ఇంగ్లాండ్ గెలుపు ఆశతో ఆటను కొనసాగించింది.
భారత రెండో ఇన్నింగ్స్లో జడేజా, సుందర్ సూపర్ సెంచరీలు
భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు. కేఎల్ రాహుల్ 90 పరుగులు వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ అయ్యాడు. రవీంద్ర జడేజా తన ఐదో టెస్ట్ సెంచరీని సిక్సర్ తో పూర్తి చేశాడు. వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లు మూడు సెంచరీలు బాదారు.
ఇంగ్లాండ్ ఏం చేయలేకపోయింది ! చివరరు మ్యాచ్ డ్రా
పైచేయిగా కనిపించిన ఇంగ్లాండ్ చివరికి భారత ప్రతిఘటన ముందు తలవంచింది. చివరిరోజు ప్రారంభంలో కేఎల్ రాహుల్ను బెన్ స్టోక్స్ ఔట్ చేసినా, అనంతరం భారత ఆటగాళ్లు నిలకడగా ఆడారు.
రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు సెంచరీలు పూర్తి చేసిన తర్వాత డ్రాగా మ్యాచ్ ముగిసింది. అయితే, ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదవ టెస్ట్ ది ఓవల్లో జూలై 31న ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ లో హెడింగ్లీ, లార్డ్స్ మ్యాచ్ల్లో నిరాశ ఎదురైనప్పటికీ మాంచెస్టర్లో భారత్ మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఐదు సెషన్ల పాటు ధైర్యంగా నిలిచి, ఇంగ్లాండ్ పేస్ దాడిని ఎదుర్కొంది.