- Home
- Sports
- Cricket
- Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు టీమిండియా తరపున ఆడిన ఇంకొందరు క్రికెటర్లు కూడా విదేశాల్లో నివాసం ఉంటున్నారు. మంచి అవకాశాలు, ఉద్యోగం, పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తు కోసం వేరే దేశాలకు వెళ్లారు. ఇలాంటి ఐదుగురు భారత క్రికెటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కోహ్లీ లాగే విదేశాల్లో స్థిరపడిన ఇండియన్ క్రికెటర్లు వీళ్లే..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కుటుంబంతో కలిసి లండన్ లో నివాసముంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అయిన అతడి భార్య అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంటోంది... ఇద్దరు బిడ్డలు వామిక, అకాయ్ ఆలనాపాలనా చూస్తోంది. ఇండియాలో సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండదు కాబట్టే లండన్ లో సెటిల్ అయ్యామని కోహ్లీ దంపతులు చెబుతున్నారు.
అయితే విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు విదేశాల్లో సెటిల్ ఆయ్యారు. ఇప్పుడు ఏ మాజీ టీమిండియా ఆటగాడు ఏ దేశంలో ఉంటున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.
రాబిన్ ఊతప్ప – దుబాయ్
భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప తన దూకుడైన బ్యాటింగ్తో అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్లోనూ అదరగొట్టాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఊతప్ప సభ్యుడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లకు ఆడాడు.
2022లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఊతప్ప కుటుంబంతో కలిసి దుబాయ్కు మకాం మార్చాడు. పిల్లల చదువులు, మెరుగైన జీవనశైలి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు సందర్భాల్లో అతడు వెల్లడించాడు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, కామెంటేటర్గా కొనసాగుతున్నాడు.
ఫరూఖ్ ఇంజనీర్ – ఇంగ్లండ్
భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఫరూఖ్ ఇంజనీర్ 1960, 70వ దశకాల్లో కీలక ఆటగాడు. తన దూకుడైన బ్యాటింగ్, చురుకైన వికెట్ కీపింగ్తో బాగా పాపులర్ అయ్యాడు. భారత్ తరఫున 46 టెస్టులు ఆడి 2,600కు పైగా పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి, ఆ తర్వాత ఇంగ్లండ్లోని లాంకషైర్ కౌంటీ క్లబ్కు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత భార్యతో కలిసి ఇంగ్లండ్లోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, గెస్ట్ స్పీకర్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
రూసీ సుర్తి – ఆస్ట్రేలియా
భారత మాజీ ఆల్-రౌండర్ రూసీ సుర్తి 1960లలో టీమిండియాలో ముఖ్యమైన ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాటర్, ఎడమచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన సుర్తి ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.
భారత్ తరపునే కాదు ఆస్ట్రేలియా వెళ్లి క్వీన్స్లాండ్ క్లబ్ క్రికెట్లో ఆడాడు. ఆస్ట్రేలియాలో పోటీ క్రికెట్ ఆడిన తొలి భారత ఆటగాళ్లలో ఇతను ఒకడు. రిటైర్మెంట్ తర్వాత బ్రిస్బేన్లో కోచింగ్ అకాడమీని ప్రారంభించి యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. చాలా ఏళ్లుగా ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్నాడు.
బుధి కుందరన్ – స్కాట్లాండ్
భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ బుధి కుందరన్ 1960లలో కీలక ఆటగాడు. తన దూకుడైన బ్యాటింగ్, చురుకైన కీపింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత స్కాట్లాండ్కు వెళ్లి అక్కడ క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. తర్వాత గ్లాస్గో నగరంలోనే శాశ్వతంగా స్థిరపడి, స్థానిక యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం చేశాడు. విదేశాల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తొలి తరం భారత క్రికెటర్లలో బుధి కుందరన్ ఒకడు. అతను 2006లో గ్లాస్గోలోనే మరణించాడు.
ఉన్ముక్త్ చంద్ – అమెరికా
2012 అండర్-19 ప్రపంచకప్లో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్. ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని భారత జట్టు భవిష్యత్ స్టార్గా భావించారు. కానీ ఆశించిన అవకాశాలు రాకపోవడంతో 2021లో భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అమెరికాకు వెళ్లాడు. అక్కడి క్రికెట్ లీగ్లు, క్లబ్ టోర్నీలలో ఆడుతూ తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికాలోని పలు టీ20 టోర్నీల్లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

