India Vs New Zealand: పొట్టి పోరులో కివీస్ కు గట్టి దెబ్బ.. ఇక టీమిండియా నెక్ట్స్ టార్గెట్ అదే...
Ind Vs Nz Test Series: టీ20 లలో కివీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు మరోసారి ఆ జట్టును దెబ్బకొట్టాలని చూస్తున్నది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆ జట్టును 2-0తో ఓడిస్తే...
సరిగ్గా మూడు వారాల క్రితం టీమిండియా పరిస్థితి దారుణం. టీ20 ప్రపంచకప్ లో కోట్లాది మంది ఆశలను వమ్ము చేస్తూ విరాట్ కోహ్లి సేన.. పాకిస్థాన్, న్యూజిలాండ్ మీద వరుస పరాజయాల పాలవుతుంటే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఐసీసీ ఈవెంట్లలో మన పాలిట శాపంగా మారిన న్యూజిలాండ్.. ఈసారి కూడా టీమిండియాకు అడ్డుగోడ వేసింది.
అయితే ఫైనల్ కు చేరిన ఆ జట్టు కూడా తుది పోరులో ఆసీస్ చేతిలో చావుదెబ్బ తిన్నది. ఇక ఆ వెంటనే భారత్ కు వచ్చిన న్యూజిలాండ్.. ఇక్కడా అదే పరిస్థితి. మూడు టీ20లలో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా గెలవలేదు.
ప్రపంచకప్ ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా.. కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిన బాధలో ఉన్న ఆ జట్టుకు మరింత క్షోభను మిగుల్చుతూ టీ20 సిరీస్ ను నెగ్గింది. అయితే పొట్టి పోరులో ఆ జట్టును గట్టిదెబ్బ కొట్టిన టీమిండియా.. ఇక తర్వాత టార్గెట్ ను కూడా సెట్ చేసుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ ను ఓడించి ట్రోఫీ నెగ్గిన న్యూజిలాండ్ ను ఓడించడానికి ఇండియాకు ఇదే మంచి అవకాశం. రాబోయే రెండు టెస్టుల సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ చేస్తే టెస్టుల్లో మళ్లీ మనం అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఐసీసీ టెస్టు ర్యాంకింగుల ప్రకారం.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం న్యూజిలాండ్ టాప్ లో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. 2,764 పాయింట్లు, 126 రేటింగ్ తో కివీస్ ప్రథమస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న భారత్ కు 2,987 పాయింట్లు, 119 రేటింగ్ ఉంది.
అయితే వచ్చే రెండు టెస్టుల సిరీస్ లో కేన్ విలియమ్సన్ సేనను 2-0తో ఓడిస్తే అప్పుడు కివీస్ తన పాయింట్లతో పాటు రేటింగ్ కూడా కోల్పోతుంది. దాంతో భారత్ తిరిగి టెస్టుల్లో మొదటి ర్యాంకు చేరుకునే అవకాశముంది. అయితే ఈ మేరకు తొలి టెస్టు కీలకం కానున్నది.
నవంబర్ 25-29 మధ్య కాన్ఫూర్ గ్రీన్ పార్కు స్టేడియంలో జరిగే తొలి టెస్టుకు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో అజింక్యా రహానే సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. భారత టీ20 సారథి రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు.
అయితే కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో.. రహానే సారథ్యంలో భారత్ ఈ టెస్టులో విజయం సాధించి ఘనంగా బోణీ కొట్టాలని చూస్తున్నది. సాధారణంగా స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ పై భారత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్ల పని పట్టాలని టీమిండియా భావిస్తున్నది.
ఇక టీ20 ప్రపంచకప్ అనంతరం భారత్ తో జరిగిన టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కేన్ మామ.. టెస్టు సిరీస్ కు మాత్రం జట్టుతో కలవనున్నాడు. అతడితో పాటు కైల్ జెమీసన్ కూడా జట్టుతో చేరతాడు. అయితే స్పిన్ కు అనుకూలించే ఉపఖండపు పిచ్ లపై రాణించడానికి కివీస్ కూడా ఈసారి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను జట్టులోకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వారిలో కనీసం ముగ్గురినైనా తొలి టెస్టులో ఆడించే అవకాశముంది.