Ind Vs Nz: ముంబై టెస్టులో టీమిండియా నెలకొల్పిన రికార్డులివే.. ఆ ఆటగాడిదే అగ్రతాంబూలం..
Ind Vs Nz Test Records: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ముంబైలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు ను గెలవడంతో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంది.
టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ముంబైలో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్.. పలు రికార్డులను కూడా నెలకొల్పింది. జట్టుగానే గాక వ్యక్తిగతంగా కూడా మన ఆటగాళ్లు కూడా రికార్డులు సృష్టించారు. అవేంటంటే..
భారత్ కు ఇదే పెద్ద విజయం : టెస్టుల్లో టీమిండియాకు పరుగుల పరంగా భారీ విజయమిదే. ఈ టెస్టులో విరాట్ సేన 372 పరుగులతేడాతో కివీస్ ను ఓడించింది. అంతకుముందు.. 2015లో ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు ఫార్మాట్లలో 50 విజయాలు : వన్డే, టెస్టు, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా అదరగొట్టే కింగ్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో 50+విజయాలలో భాగమైన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. టెస్టులో ఆటగాడిగా (కెప్టెన్ గా 39 విజయాలు) 50 విజయాల్లో భాగస్వామిగా ఉన్న విరాట్.. 153 వన్డేలు, 61 టీ20 మ్యాచులలో భాగమయ్యాడు.
స్వదేశంలో 14వ సిరీస్ గెలుపు : 2013 నుంచి భారత్ లో జరిగిన ఏ టెస్టు సిరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. న్యూజిలాండ్ తో సిరీస్ గెలుపు భారత్ కు వరుసగా 14వ సిరీస్ విజయం. ఇందులో 11 సిరీస్ లు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడినవే కావడం గమనార్హం.
అశ్విన్ రికార్డులు : ఈ ఏడాది అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య 52 కు చేరింది. టెస్టులలో ఓ క్యాలెండర్ ఇయర్ లో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది నాలుగోసారి. ఇంతకుముందు కుంబ్లే, హర్భజన్ లు 3 సార్లు ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో షేన్ వార్న్ (8 సార్లు) అందరికన్నా ముందున్నాడు.
అంతేగాక స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలతో కుంబ్లే (350 వికెట్లు) ముందున్నాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్.. 265 వికెట్లతో మూడో ప్లేస్ లో ఉన్నాడు.
స్వదేశంలో 300 వికెట్లు తీసిన బౌలర్లలో కూడా అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. 49 మ్యాచుల్లో అశ్విన్ ఈ ఘనత సాధించగా.. 48 టెస్టులలోనే శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్.. ఈ ఫీట్ రికార్డు చేశాడు. కుంబ్లే 52 టెస్టుల్లో 300 వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. రెండు దేశాల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లలో భాగంగా.. కివీస్ కే చెందిన రిచర్డ్ హ్యడ్లీ 65 వికెట్లు తీయగా.. అశ్విన్ 66 వికెట్లతో ఆ రికార్డును చెరిపేశాడు.
పరుగుల పరంగా కివీస్ కు ఇదే అత్యంత భారీ ఓటమి.. అంతకుముందు ఆ జట్టు 2007లో దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లో 358 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.