Shubman Gill: 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్మన్ గిల్
IND vs ENG: భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.

ఓవల్ లో చరిత్ర సృష్టించిన శుభ్ మన్ గిల్
భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. 2025 భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్ మరో రికార్డు సాధించాడు. ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు భారత కెప్టెన్గా గిల్ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇంగ్లాండ్ బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన 21వ ఓవర్లో వచ్చిన బౌండరీతో గిల్ ఈ రికార్డును సాధించాడు. శుభ్మన్ గిల్ 737* పరుగులతో లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ రికార్డు ను బద్దలు కొట్టాడు. గవాస్కర్ వెస్టిండీస్ తో 1978/79 టెస్టు సిరీస్లో 732 పరుగులతో రికార్డు సాధించాడు.
KNOW
భారత కెప్టెన్గా ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు-టాప్ 5 ప్లేయర్లు
శుభ్మన్ గిల్ ప్రస్తుతం 737 పరుగులతో ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా రికార్డు సాధించాడు.
- 737* పరుగులు - శుభ్మన్ గిల్ vs ENG, 2025
- 732 - సునీల్ గవాస్కర్ vs WI, 1978/79
- 655 - విరాట్ కోహ్లీ vs ENG, 2016/17
- 610 - విరాట్ కోహ్లీ vs SL, 2017/18
- 593 - విరాట్ కోహ్లీ vs ENG, 2018
అంతర్జాతీయ క్రికెట్ లో టాప్ 3 లో శుభ్ మన్ గిల్
శుభ్ మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ గా తన తొలి టెస్టు సిరీస్ లో సూపర్ బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అలాగే, ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
- డాన్ బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా): 810 పరుగులు
- గ్రహామ్ గూచ్ (ఇంగ్లండ్): 752 పరుగులు
- శుభ్మన్ గిల్ (భారత్): 737 * పరుగులు
- సునీల్ గవాస్కర్ (భారత్): 732 పరుగులు
ఇప్పటివరకు గిల్ ఈ సిరీస్లో నాలుగు సెంచరీలు చేశాడు. వాటిలో అత్యధిక స్కోరు 269 పరుగులు.
కోహ్లీ రికార్డును సమం చేసిన గిల్
ఒకవైపు గిల్ అద్భుతంగా బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. కానీ మరోవైపు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక అవాంఛిత రికార్డును గిల్ సమం చేశాడు. ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ ఒలీ పోప్ టాస్ గెలవడంతో, ఈ సిరీస్లో గిల్ ఐదు టాస్లను కోల్పోయాడు. ఇదివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
నాలుగు మార్పులతో ఓవల్ టెస్టు ఆడుతున్న భారత్
ఐదో టెస్టుకు భారత్ జట్టులో నాలుగు మార్పులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్, శార్దూల్ ఠాకూర్, గాయపడ్డ రిషభ్ పంత్ స్థానాల్లో ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్ జట్టులోకి వచ్చారు. మొదటి సెషన్లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ త్వరగా అవుటయ్యారు. ఆ తర్వాత గిల్, సాయి సుదర్శన్ లు భారత్ జట్టును ముందుకు నడిపించారు. లంచ్ సమయానికి భారత్ 72/2 పరుగులు చేసింది. గిల్ 21 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
కాగా, ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఓవల్ మ్యాచ్ ను గెలిచి భారత్ సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.