డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ రద్దుతో బీసీసీఐకి కలిగే నష్టం ఎంత?
Dream11 Exit as India Title Sponsor: ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కారణంగా డ్రీమ్11 భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంది. దీని కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీగా ఆర్థిక నష్టం జరిగింది.

బీసీసీఐ పై ఆన్లైన్ గేమింగ్ బిల్ దెబ్బ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI), టీమిండియాకు ఆసియా కప్ 2025 ముందు పెద్ద దెబ్బ తగిలింది. ఫాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్11 భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్గా ఒప్పందం నుంచి అవుట్ అయింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ఇందుకు కారణం. ఈ చట్టం ప్రకారం, ఏ ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలు తమ సేవలను ప్రచారం చేయరాదు, ప్రోత్సహించరాదు, నిర్వహించకూడదు.
ఆగస్టు 21న రాజ్యసభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025 ఆమోదం పొందింది. లోక్సభలో కూడా బిల్ పాస్ అయింది. ఈ బిల్ ప్రకారం మనీ సంబంధం కలిగిన అన్ని ఆన్లైన్ గేమ్స్ ను నిషేధించారు. యువతలో ఈ తరహా వ్యసనాన్ని తగ్గించడం, ఆర్థిక నష్టాలను నివారించడం లక్ష్యంగా ఈ బిల్ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
KNOW
బీసీసీఐ - డ్రీమ్11 ఒప్పందం రద్దు
భారత క్రికెట్ జట్టుతో ఉన్న హై-ప్రొఫైల్ స్పాన్సర్షిప్ ఒప్పందాన్నిఈ తాజా గేమింగ్ బిల్ కారణంగా డ్రీమ్11 రద్దు చేసుకుంది. బీసీసీఐ కూడా చట్టాన్ని ఉల్లంఘించకుండా వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 9న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగనున్న ఆసియా కప్ తొలి మ్యాచ్ కు ముందు భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ను కనుగొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆన్లైన్ గేమింగ్ చట్టం ప్రకారం, “ఏ వ్యక్తి కూడా ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలను ఆఫర్ చేయరాదు, ప్రోత్సహించరాదు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆడమని ప్రేరేపించకూడదు” అని స్పష్టంగా పేర్కొంది.
బీసీసీఐ - డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ ఒప్పందం విలువ ఎంత?
2023లో డ్రీమ్11 సంస్థ బీసీసీఐతో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ రూ.358 కోట్లు. అంటే సంవత్సరానికి సుమారు రూ.119 కోట్లు బీసీసీఐకి వచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2026 వరకు కొనసాగాల్సి ఉంది.
అదనంగా, బీసీసీఐ మైసర్కిల్11తో ఫాంటసీ గేమింగ్ భాగస్వామ్యం కోసం ఐదేళ్లపాటు రూ.625 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా సంవత్సరానికి రూ.125 కోట్లు వచ్చేలా ఒప్పందం ఉంది.
డ్రీమ్ స్పోర్ట్స్ భారీ ఖర్చులు
డ్రీమ్11 పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలు, ప్రమోషన్లపై రూ.2964 కోట్లు ఖర్చు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 37% ఎక్కువ. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, డ్రీమ్11, మైసర్కిల్11 కలిపి ప్రతి సంవత్సరం సుమారు రూ.5000 కోట్లు మార్కెటింగ్, ప్రమోషన్, అడ్వర్టైజింగ్ పై ఖర్చు చేస్తున్నాయి.
బీసీసీఐకి కలిగే నష్టం ఎంత?
డ్రీమ్11 స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడం వలన బీసీసీఐకి సంవత్సరానికి రూ.119 కోట్ల నష్టం కలుగుతుంది. ఇది కేవలం స్పాన్సర్షిప్ ఫీజు మాత్రమే. అదనంగా అడ్వర్టైజింగ్, మెర్చండైజ్ భాగస్వామ్యాలు, ఇతర కమర్షియల్ ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా నష్టం కలగనుంది.
ఆన్లైన్ గేమింగ్ చట్టం కారణంగా డ్రీమ్11 - బీసీసీఐ మధ్య లాభదాయక ఒప్పందం రద్దు కావడంతో ఇప్పుడు కొత్త స్పాన్సర్ను చూసుకోవాలి. రాబోయే ఆసియా కప్ 2025, ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఈ ఆర్థిక లోటును పూడ్చుకోవడం బోర్డుకు కీలక సవాల్గా మారింది. ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కారణంగా భారత క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు జరుగుతున్నాయి.