- Home
- Business
- Gold Price Hike: బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం..షాకిస్తున్న వెండి ధరలు, ఆందోళనలో పసిడి ప్రియులు
Gold Price Hike: బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం..షాకిస్తున్న వెండి ధరలు, ఆందోళనలో పసిడి ప్రియులు
Gold Price Hike: బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరగడంతో ఆందోళన నెలకొంది. కొద్దిరోజులుగా తగ్గిన బంగారం, ఇప్పుడు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, కేంద్రం నిర్ణయాలు గోల్డ్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.

జనవరి నుంచి బంగారం ధరల్లో భారీ ఒడిదుడుకులు
ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే బంగారం ధరల్లో భారీ ఒడిదుడుకులు కనిపించాయి. జనవరి మధ్యలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.41 లక్షల వద్ద ఉండగా, కొన్ని వారాల్లోనే అది రూ.1.75 లక్షల స్థాయికి చేరింది. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో ధరలు తగ్గినా, ఏప్రిల్ నుంచి మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం ధరలు మళ్లీ రూ.1.60 లక్షల పైస్థాయిలో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో కొనుగోలు ఆసక్తి పెరగడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు.

గోల్డ్ మార్కెట్పై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
అంతర్జాతీయ పరిస్థితులు కూడా గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్ సమస్యలు వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి పరిణామాలు, గ్లోబల్ సప్లై చైన్పై ఆందోళనలు కూడా సేఫ్ హేవెన్ డిమాండ్ను పెంచుతున్నాయి.
రూ.1,62,330కు చేరిన మేలిమి బంగారం
మే 14 నాటికి హైదరాబాద్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.1,62,330కు చేరుకుంది. 22 క్యారెట్ గోల్డ్ ధర కూడా రూ.300 పెరిగి రూ.1,48,800గా నమోదైంది. అలాగే 18 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.1,21,750 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ బంగారం ధర దాదాపు రూ.10 వేల వరకు పెరిగింది. నిన్న రూ.14 వేలు పెరిగిన బంగారం... సాయంత్రానికి రూ.6 వేలు తగ్గింది.
షాకిచ్చిన వెండి ధరలు
వెండి ధరలు కూడా అదే దారిలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3.20 లక్షలకు చేరుకుంది. అంటే తులం వెండి ధర రూ.3200 వరకు ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే వెండి ధర సుమారు రూ.40 వేల వరకు పెరగడం గమనార్హం. బంగారం, వెండి రెండింటిలోనూ ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఆసక్తి చూపుతుండటంతో డిమాండ్ పెరుగుతోంది.
దేశీయ మార్కెట్పై అదనపు భారం
అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువకాలం కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. అదే సమయంలో డాలర్ బలం పెరగడం, ట్రెజరీ యీల్డ్స్ ఎగబాకడం బంగారం ధరలపై మిశ్రమ ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు భారత్ ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచడం దేశీయ మార్కెట్పై అదనపు భారం మోపుతోంది. దీంతో జ్యువెలరీ డిమాండ్పై కూ డా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్కెట్ పరిస్థితులు గమనించాలంటున్న నిపుణులు
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ భయాలు, చమురు ధరలు, డాలర్ మార్పులు వంటి అంశాలు ఇప్పుడు బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

