UPI: పదే పదే బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.? మారనున్న యూపీఐ పేమెంట్ రూల్స్
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్న రోజులివీ. ఈ నేపథ్యంలోనే యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్పులు చేస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

బ్యాలెన్స్ చెకింగ్పై పరిమితులు
ప్రస్తుతం ఫోన్పే, గూగుల్పే, పేటీఎమ్ వంటి యాప్స్లో బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి దీనిని రోజుకు 50 సార్లకు పరిమితం చేస్తున్నారు. అనవసరంగా బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల సర్వర్ల మీద భారం పడుతుందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక్కో యాప్లో 50 సార్లు చెక్ చేసుకునే అవకాశం ఉండడం ఊరటనిచ్చే అంశం.
ఆటోపే స్లాట్ టైమింగ్ ఫిక్స్
ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి ఆటో డెబిట్ లావాదేవీలు ఇకపై నాన్-పీక్ అవర్స్లోనే జరుగుతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఈ డెబిట్లు ప్రాసెస్ అవుతాయి. దీంతో ఇతర సమయాల్లో పేమెంట్స్ ఆలస్యం కావు.
ఫెయిలైన ట్రాన్సాక్షన్ స్టేటస్ 3 సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు
మీ యూపీఐ పేమెంట్ పెండింగ్లో ఉంటే.. ఆ స్టేటస్ను మీరు కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు. ప్రతి రెండు చెకింగ్ల మధ్య కనీసం 90 సెకండ్లు గ్యాప్ ఉండాలి. ఇది కూడా సిస్టమ్ మీద భారం తగ్గించేందుకు తీసుకున్న చర్యగా చెబుతున్నారు.
గత 6 నెలల్లో తీసుకున్న ముఖ్యమైన మార్పులు ఇవే..
* జూన్ 2025లో యూపీఐ API రిస్పాన్స్ టైమ్ 15 సెకండ్లకు తగ్గించారు. ఫెయిలైన ట్రాన్సాక్షన్ రివర్సల్ 10 సెకండ్లలో పూర్తవుతోంది.
* పేమెంట్ చేసే ముందు మీరు డబ్బులు పంపే ముందు సదరు వ్యక్తి బ్యాంక్ రిజిస్టర్డ్ పేరు కనిపిస్తుంది. జూన్ 30వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది.
* డిసెంబర్ 2024లో తీసిన నిర్ణయం ప్రకారం, నెలలో గరిష్టంగా 10 సార్లు మాత్రమే చార్జ్బ్యాక్ కోరవచ్చు. ఒకే వ్యక్తికి 5 సార్లు మాత్రమే పరిమితం చేశారు.
ఈ మార్పులు ఎందుకు.?
ప్రస్తుతం ప్రతి నెల 16 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా సర్వర్ సమస్యలు వచ్చాయి. వాటికి ప్రధాన కారణం యూపీఐ APIలపై జరిగిన అధికమైన కాల్స్. అనవసరంగా బ్యాలెన్స్ చెక్ చేయడం, ఒకే ట్రాన్సాక్షన్ను పునరావృతంగా చెక్ చేయడం వంటివి ఈ సమస్యలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి.